
రిజిస్ట్రేషన్ల శాఖలో రేపటి నుంచి ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానం
22 కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు
కుత్బుల్లాపూర్లో రద్దీ దృష్ట్యా 144 స్లాట్లు.. అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల నియామకం
చంపాపేట–సరూర్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధి విలీనం
సేల్డీడ్ దస్తావేజులు క్రయవిక్రయదారులే తయారు చేసుకునేలా వెబ్సైట్లో ప్రత్యేక మాడ్యూల్
డబుల్ రిజిస్ట్రేషన్లకు చట్ట సవరణతో చెక్ పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణకు సమయం ఆసన్నమైంది. ఈనెల 10 నుంచి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశమున్నప్పటికీ ఎక్కువ మంది మాన్యువల్గానే చేసుకునేవారు. అయితే, గురువారం నుంచి రాష్ట్రంలోని 22 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయనున్నారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈనెల 10 నుంచి ఆజంపురా, చిక్కడపల్లి, సదాశివపేట, కుత్బుల్లాపూర్, వల్లభ్నగర్, శంషాబాద్, సరూర్నగర్, చంపాపేట, రామగుండం, కూసుమంచి, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్కర్నూల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్ఆర్వో)తోపాటు ఖమ్మం, మేడ్చల్, మహబూబ్నగర్ ఆర్వో కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
స్లాట్తో పాటు వాకిన్ కూడా..
పైలట్గా ప్రారంభించనున్న స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ల కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్ లావాదేవీల రద్దీని తగ్గించేలా ఒక్క రోజులో పనివేళలను 48 స్లాట్లుగా విభజించారు. స్లాట్ బుకింగ్ కోసం registration.telangana.gov.i అనే వెబ్సైట్ ద్వారా క్రయవిక్రయదారులు తమ అనుకూలమైన తేదీ, సమయంలో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆ మేరకు స్లాట్ సమయానికి సదరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఒకవేళ స్లాట్ బుకింగ్ ద్వారా కాకుండా నేరుగా మాన్యువల్ పద్ధతిలోనూ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటును పైలట్ పద్ధతిలోనూ కొనసాగించనున్నారు. అత్యవసర సందర్భాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ప్రతి రోజూ సాయంత్రం 5–6 గంటల సమయంలో ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు అనుమతించనున్నారు. ఇందులో మొదట కార్యాలయానికి వచ్చిన వారికి ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’విధానంలో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ
స్లాట్ బుకింగ్ విధానం కోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఎక్కువ రద్దీ ఉండేవి, రద్దీ లేని వాటిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమం చేయనున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ లాంటి రద్దీ ఎక్కువ ఉండే కార్యాలయాల్లో రోజుకు 48 స్లాట్లు సరిపోవనే ఉద్దేశంతో ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను అదనంగా నియమించనున్నారు.
తద్వారా ఈ కార్యాలయంలో రోజుకు 144 స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి తోడు క్రయవిక్రయదారులు డాక్యుమెంట్ల తయారీ కోసం ఇతరులపై ఆధారపడకుండా సొంతంగానే దస్తావేజులను తయారు చేసుకునే వెసులుబాటును కూడా ఆ శాఖ కల్పించనుంది. ఇందుకోసం శాఖ వెబ్సైట్లో ఒక మాడ్యూల్ను పొందుపర్చాలని, దీని ద్వారా సేల్డీడ్ దస్తావేజులు తయారు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
దీనికి తోడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘ఆధార్–ఈ సంతకం’విధానాన్ని ఈనెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మిన, కొన్న వారితో పాటు సాక్షులు, సబ్రిజిస్ట్రార్ స్వదస్తూరితో సంతకాలు చేయడం లేదా వేలిముద్రలు వేయడానికి చాలా సమయం పడుతోందని, ఈ విధానం అమల్లోకి వస్తే ఆధార్లో ఉన్న సంతకాన్ని నమోదు చేస్తామని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్పెట్టే దిశలో కూడా ఆ శాఖ మరో అడుగు ముందుకు వేయనుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా రాష్ట్రాలు సవరించుకున్నట్లుగానే తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ల చట్టాన్ని సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చట్టంలోని సెక్షన్ 22కు సవరణ చేసి 22బీని తీసుకురానుంది.
10–15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్: మంత్రి పొంగులేటి
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా ప్రజలు గంటలకొద్దీ నిరీక్షించకుండా 10–15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 144 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 22 చోట్ల పైలట్ పద్ధతిలో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శక పద్ధతిలో అవినీతిరహితంగా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అందులోభాగంగా సంస్కరణలను తెస్తున్నామని పొంగులేటి చెప్పారు.