మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..  | Shocking Incident in Vemulawada | Sakshi
Sakshi News home page

మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. 

Apr 14 2025 1:36 PM | Updated on Apr 14 2025 3:39 PM

Shocking Incident in Vemulawada

ఫంక్షన్‌ హాల్‌ బంగ్లాపై గొడ్డళ్లతో నరికి.. 

మృతుడు నాగయ్యపల్లి వాసి చెట్టిపల్లి పర్శరాం  

డ్రగ్స్‌ ముఠాలో తగాదాతో హత్యగా చర్చ  

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు   

వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్‌ హాల్‌ మర్డర్‌తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్‌ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. 

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్‌ హాల్‌ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్‌ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్‌ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్‌ హాల్‌ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు.  

ట్రాక్టర్‌ వద్ద రోదనలు.. 
మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్‌ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.  

తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. 
తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement