Shamirpet: ఒచ్చిర్రు.. కూసుర్రు.. పోయిర్రు.. పదవీ అంటే అనుభవించడమా.? 

Shameerpet Officers And Leaders Negligence In General Zone Meeting - Sakshi

 ఇదీ మన అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు!

తూతూమంత్రంగా మండల సాధారణ సర్వసభ్య సమావేశం

సమావేశానికి అరగంట ఆలస్యంగా వచ్చిన ఎంపీడీఓ, అధికారులు

సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేసిన అధికారులు

అసహనం వ్యక్తం చేసిన పలువురు ఎంపీటీసీలు

సాక్షి, శామీర్‌పేట్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం తూతూమంత్రంగా జరిగింది. సభలో సమస్యల గురించి చర్చించి.. ఆ సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతా రాహిత్యంగా కనిపించారు. వీరి తీరుపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేయడంతో సభ రసాబాసగా మారింది. పదవి అంటే అనుభవించడం కాదు అది ఒక బాధ్యత (దేశ సేవ) అని తెలుసుకున్న నాడే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గమనించాలి. 

సభా దృష్టికి వచ్చిన విషయాలు.. 
మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు దాసరి యెళ్ళుబాయి అధ్యక్షతన సోమవారం శామీర్‌పేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. 
చదవండి: నాడు డెల్టా.. నేడు ఒమిక్రాన్‌.. వెంటాడుతున్న కరోనా వైరస్‌ గుబులు

♦ మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో రెండ్డు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్‌ మోహన్‌రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు.  
♦ ప్రజయ్‌హోమ్స్‌లో మురుగుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని  ఎంపీటీసీ అశోక్‌రెడ్డి ఆరోపించారు. 
♦ కరోనా రెండో డోస్‌ వేసుకోని వారు ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారులు కోరారు. 
♦ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 
♦ ప్రజల ఓటేస్తే గెలిచిన తాను ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఈ ఎంపీటీసీ పదవి ఎందుకని అలియాబాద్‌ ఎంపీటీసీ కోడూరి అశోక్‌ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారులు, సర్పంచ్‌ల గైర్హాజరు... 
సోమవారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అధికారులు, పలువురు సభ్యులు ఆలస్యంగా రావడంతో సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. కొందరు మండల స్థాయి అధికారుల గైర్హాజరు అయ్యారు. శామీర్‌పేట మండలంలోని 10 మంది సర్పంచ్‌లలో నలుగురు సర్పంచ్‌లే హాజరవడం గమనార్హం. 
చదవండి:హైదరాబాద్‌: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు

సెల్‌ఫోన్లతో అధికారుల కాలక్షేపం... 
సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్‌ చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చే యాల్సిన అధికారులు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పదవీ అంటే

పదవీ అంటే అనుభవించడమా.? 
దీనిని బట్టి ప్రజాసమస్యల పరిష్కారానికి వీళ్లు ఎంత మేరా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్‌ పదవి అంటే అనుభవించడమని వారు అనుకోవడం దురదృష్టకరం అని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే సోయ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top