ఆన్‌లైన్‌ పూజలు.. ఇంటికే ప్రసాదం  | Secundrabad Ganesh Temple Planing Online Services Prasadam Home Delivery | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పూజలు.. ఇంటికే ప్రసాదం 

Aug 26 2021 7:55 AM | Updated on Aug 26 2021 8:22 AM

Secundrabad Ganesh Temple Planing Online Services Prasadam Home Delivery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్‌లైన్‌ సేవలు, స్పీడ్‌పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్‌ గణేశ్‌ టెంపుల్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్‌ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్‌ వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు.  కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్‌ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు.

సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement