బడి సేవలు సులభతరం! | Telangana govt schools to go online classes | Sakshi
Sakshi News home page

బడి సేవలు సులభతరం!

Apr 4 2026 4:48 AM | Updated on Apr 4 2026 4:48 AM

Telangana govt schools to go online classes

పాఠశాలల్లో సర్విసులను ఆన్‌లైన్‌లో అందించే యోచన 

కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ  

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల సేవలు సులభతరం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సేవలను ఆన్‌లైన్‌ పద్ధతిలో అందించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో అందే సర్విసులను ఇకపై ఆన్‌లైన్‌ ఆధారితంగా అందించనుంది. ప్రస్తు తం పాఠశాలల్లో ట్రాన్స్‌ఫర్‌ సర్టీఫికెట్‌ (టీసీ), బోనఫైడ్, విద్యార్థి వివరాల్లో సవరణలు, పదోతరగతిలో వివరాల అప్‌డేషన్‌ తదితర సర్వీసులు అందుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు సదరు పాఠశాలలో నేరుగా సంప్రదించాల్సి వస్తోంది.

ఈ క్రమంలో పాఠశాల హెచ్‌ఎంలు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలతో సేవలు పొందడంలో ఆలస్యమవుతోంది. ఇకపై  జాప్యానికి అవకాశం లేకుండా పాఠశాల విద్యాశాఖ నేరుగా ఆన్‌లైన్‌లోనే ఈ సర్విసు లు అందించాలని భావిస్తోంది. దీంతో ఈ సర్విసులను పారదర్శకతతోపాటు నిర్దిష్ట సమయంలో అందించడం, డిజిటల్‌ పద్ధతిలో రికార్డుల నిర్వహణకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. 

మీసేవ కేంద్రాలతో లింకు : విద్యార్థులకు డూప్లికేట్‌ మెమోలు జారీ చేసేందుకు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(బీఎస్‌ఈ) ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సర్విసు ప్రయోగ దశలో ఉంది. గతంలో డూప్లికేట్‌ మెమో కావాలనుకుంటే విద్యార్థులు నేరుగా బోర్డు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దరఖాస్తు చేసుకోవడం ఒక ఎత్తయితే... సర్టీఫికెట్‌ పొందేందుకు పట్టే సమయం...అందుకు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం..చివరకు పాఠశాలకు వచ్చే వరకు సుదీర్ఘ సమయం పట్టేది. ఇకపై అలాంటి ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పాఠశాల సర్విసులు కూడా ఆన్‌లైన్‌లో అందించే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది.

అయితే ఈ సేవలను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. ట్రాన్స్‌ఫర్‌ సర్టీఫికెట్‌ లేదా బోనఫైడ్‌ ఇతర పాఠశాల సేవలు పొందాలనుకుంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుతుంది. ఆ వినతికి అనుగుణంగా సదరు మండల విద్యాధికారి/పాఠశాల ప్రిన్సిపల్‌ లాగిన్‌లో ప్రత్యక్షమవుతుంది. అక్కడి నుంచి ధ్రువీకరణ అందిన వెంటనే మీసేవ కేంద్రంలో సర్టీఫికెట్‌ ప్రత్యక్షమవుతుంది. ఏటా విద్యార్థుల వివరాలు అపార్‌లో అప్‌డేట్‌ అవుతుంటాయి. అపార్‌ వివరాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తుండగా, అతి త్వరలో సీఎం అనుమతి తీసుకున్న తర్వాత ఈ సేవలను అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement