సనత్నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు.
శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు.


