
బీఎస్–3 కార్లకు ఇంజిన్, చాసిస్ నంబర్ల మార్పు
ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల నంబర్లు వేసి విక్రయాలు
చోరీకి గురైన కారు యజమాని ఫిర్యాదుతో బయటపడిన వ్యవహారం
మిర్యాలగూడ: గడువు తీరిన వాహనాలను స్క్రాప్ కింద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ప్రమాదానికి గురైన వాహనాల ఇంజిన్, చాసిస్ నంబర్లను వీటికి మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. హైదరాబాద్లో చోరీకి గురైన ఒక కారును మిర్యాలగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒకరు ఇటీవల ఆంధ్రాలో కొనుగోలు చేశారు.
ఈ కారును మిర్యాలగూడలోని ఓ కారు షెడ్డులో మరమ్మతు చేయిస్తుండగా, కారు జీపీఎస్ ఆన్ అయ్యింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో కారు చోరీకి గురైనట్టు యజమాని అక్కడ ఫిర్యాదు చేశాడు. కారు జీపీఎస్ ఆధారంగా మిర్యాలగూడకు వచ్చిన సదరు యజమాని.. విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కారు ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ మార్చి ఉన్నట్టుగా గుర్తించిన మెకానిక్.. విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో కారు ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరు అమ్మారో చెప్పాలని పోలీసులు మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని ప్రశ్నించారు. ఆయన చెప్పిన వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారైనట్టు తెలిసింది.
చాసిస్ నంబర్లు మార్చి అధిక ధరలకు విక్రయాలు
సదరు కారు నంబర్ ఎవరు మార్చారు.. ఎలా మార్చారనే విషయాన్ని విచారణ చేసే క్రమంలో మిర్యాలగూడకు చెంది న ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో తాను ఈ కారు నంబర్, చాసిస్ నంబర్ మార్చలేదని.. కానీ, పట్టణంలోని ఒక పార్కింగ్ యార్డు యజమాని పంపించిన 3కార్లకు మాత్రం ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా ఆ పార్కింగ్ యార్డులో 60 రోజుల సీసీ టీవీ ఫుటేజీ అందుబా టులో ఉంటుందని, పోలీసులు ఈ ఫుటేజీని పరిశీలిస్తే ఇలాంటి కార్లు ఎన్ని ఉన్నాయో వెలుగు చూసే అవకాశముంది.
బీఎస్–3 వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి...
మిర్యాలగూడలోని కారు గురించి కూపీ లాగడంతో బీఎస్– 3 వాహనాల దందా బయటపడింది. 2019లో భారత ప్రభుత్వం నిర్ణీత గడువు తీరిన తర్వాత బీఎస్–3 కార్లను విక్రయించొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో షోరూమ్ల యజమానులు చాసిస్, ఇంజిన్ నంబర్లను తొలగించి వాటిని స్క్రాప్ కింద విక్రయించినట్టు సమాచారం. వీటిని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రోడ్డు ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల ఇంజిన్, చాసిస్ నంబర్లను అమర్చి బీఎస్–3 వాహనాలను అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. ఈ దందా భారీగానే కొనసాగుతున్నట్టు సమాచారం. బీఎస్–3 వాహనాలకు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చి విక్రయాలు జరుపుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నా మని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు చెప్పారు.