
సాక్షి, రాంగోపాల్పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్స్ట్రాగామ్లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్పేట్ గైదీన్బాగ్కు చెందిన కీర్తి, రామంతపూర్కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్లోని ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పుట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.