గురుకుల విద్యార్థినికి ర్యాగింగ్
కాగజ్నగర్ టౌన్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీ సమీపంలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థినిపై కొందరు విద్యార్థినులు దుప్పటి కప్పి బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతోంది.
శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత స్టడీ అవర్ సమయంలో చదు వుకునేందుకు హాల్లోకి వెళ్తుండగా.. బాలికను గదిలో నే కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గు ర్తు పట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. దీంతో క్యాప్ కడుపులోకి వెళ్లింది. వెంటనే సదరు విద్యార్థిని ఎస్వోకు సమాచారం అందించడంతో హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం క్యాప్ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


