శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం | Protest in Hyderabad against Operation Kagar: Telangana | Sakshi
Sakshi News home page

శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం

Jun 18 2025 5:30 AM | Updated on Jun 18 2025 5:30 AM

Protest in Hyderabad against Operation Kagar: Telangana

మాట్లాడుతున్న హరగోపాల్‌. చిత్రంలో జస్టిస్‌ చంద్రకుమార్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని, విమలక్క, మల్లు లక్ష్మి, పశ్య పద్మ, గోవర్దన్, తమ్మినేని తదితరులు

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

17 నెలల్లో 540 మందిని చంపారు

మావోయిస్టుల శవాలకు ఖర్మకాండలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు

ఈ హింసపై సుప్రీంకోర్టు స్పందించాలి.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

శాంతి చర్చల కమిటీ మహాధర్నాలో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌/కవాడిగూడ: శాంతి చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని శాంతి చర్చల కమిటీ మహాధర్నాలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట గత 17 నెలల్లో 540 మందిని భద్రత బలగాలు చంపాయన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణం నిలిపివేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ హింసపై సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా తీసుకోవాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. ఆపరేషన్‌ కగార్‌ ఆపివేయాలి..మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే ప్రారంభించాలన్న నినాదంతో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలు హక్కుల సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు హాజరై మద్దతు ప్రకటించారు.

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయడంతోపాటు, మా వోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని మహాధర్నాకు అధ్యక్షత వహించిన జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీలు, సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ స్థాయిలోనూ ధర్నా చేస్తామన్నారు. 

⇒  ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ల కోసం ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ సంస్థల లాభాల కోసం కగార్‌ను ఆపడం లేదని విమర్శించారు. పదేళ్ల క్రితం బీజేపీ లక్ష్యం కాంగ్రెస్‌ లేని భారత్‌ అని, ప్రస్తుతం కమ్యూనిస్టులు, మావోయి స్టులు ప్రజాస్వామ్యం, ప్రతిక్షాలు లేని భారతదేశమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని చెప్పారు. 

⇒ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం కళ్లు తెరిచి ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలన్నారు. 

⇒ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ ఎందుకు నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తున్నామో ఆ కారణాలు ప్రజలకు వివరించినప్పుడే రాజకీయ పార్టీల ధోరణి మారుతుందన్నారు. 
⇒  ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నామన్నారు.

⇒  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ కేంద్రం,  మావోయిస్టుల మధ్య జరుగుతుందని అనుకుంటే పొరపాటే అన్నారు. మోదీ అమిత్‌షాలు అంతం చేయాలని అనునుకుంటున్నది కేవలం మావోయిస్టులనే కాదని, ప్రశ్నించే గొంతుకలను అని చెప్పారు. 
⇒  సినీనటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ హిందూత్వం అని చెప్పుకునే బీజేపీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు..నంబాల కేశవరావు సహా ఇతర మావోయిస్టుల మృతదేహాలకు హిందూధర్మం ప్రకారం ఖర్మకాండలు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఇదెక్కడి హిందూ ధర్మం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

⇒ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ శాంతి చర్చలకు వరంగల్‌ సభలోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మద్దతు ప్రకటించారన్నారు. 
⇒ నంబాల కేశవరావు మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కోరినా స్పందించలేదని, మావోయిస్టుల శవాలను ఇచ్చేందుకు కూడా భయపడే పరిస్థితి ఉందని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం శాంతిచర్చలకు మద్దతు పలికారు. మహాధర్నాలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ చెనగాని దయాకర్, విమలక్క, వెన్నెల గద్దర్, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement