ఇంటర్‌ కాలేజీల ఇష్టారాజ్యం | Private intermediate colleges are not focused on gaining recognition | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ కాలేజీల ఇష్టారాజ్యం

Jun 9 2025 1:07 AM | Updated on Jun 9 2025 1:07 AM

Private intermediate colleges are not focused on gaining recognition

గుర్తింపు లేకున్నా అడ్మిషన్ల జోరు...  

గుర్తింపు వచ్చినవి సగం కూడా లేవు...  

మొద్దు నిద్రలో అధికారులు 

ఆందోళనలో తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడంపై పెట్టే దృష్టి అనుబంధ గుర్తింపు తెచ్చుకోవడంపై పెట్టడం లేదు. నిబంధనలన్నీ పాటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి కాలేజీలపై ఇంటర్‌ బోర్డు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మరో వారం రోజుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. 

ఈలోగానే కాలేజీలు బోర్డు అనుమతి తీసుకోవాలి. కాలేజీల్లో చేరికలు, బోర్డ్‌ అనుమతులు, సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో నిత్యం అందుబాటులో ఉంచాలి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బోర్డు అధికారులు కూడా ఈ కాలేజీలపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గుర్తింపు విషయంలో కంగారు వద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు.   

సగం కూడా పూర్తవ్వని అఫిలియేషన్‌ 
రాష్ట్రవ్యాప్తంగా 4,089 ఇంటర్‌ కాలేజీలున్నాయి. 3,254 కాలేజీలు అఫ్లియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో అనుబంధ గుర్తింపు పొందినవి 1,312 మాత్రమే. 1,483 కాలేజీల దరఖాస్తులను బోర్డ్‌ తిరస్కరించింది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలని కోరింది. సరైన లొకేషన్‌ లేదని 1,216 కాలేజీలను పెండింగ్‌లో ఉంచారు. 

ప్రతీ ఏటా అఫ్లియేషన్‌కు దరఖాస్తు చేసే కాలేజీలు సైతం సరైన విధానంలో వెళ్లడం లేదని, ధ్రువపత్రాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బోర్డు అధికారులు అంటున్నారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాతే క్లాసులు నిర్వహించాలనే నిబంధన విధించాలని బోర్డు నిర్ణయించినా, జిల్లా అధికారులు మాత్రం దీన్ని అమలుచేయడం లేదు. ఈ కారణంగానే అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవ్వడం లేదు.  

రాజధాని పరిసరాల్లోనే సమస్యలు 
రాజధాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిల్లో చాలావరకు బహుళ అంతస్తుల భవానాల్లోనే నడుస్తున్నాయి. వీటిని జిల్లాలకు దూరంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాలేజీలు దీనికి అడ్డుపడ్డాయి. కాలేజీలు దూరంగా ఉంటే విద్యార్థులను చేర్చుకోవడం కష్టమని భావిస్తున్నా­యి. 

ఇలాంటి కాలేజీల జాబితాను అధికారులు తెప్పించారు. ప్రభుత్వానికి కూడా ఇటీవల నివేదించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. గుర్తింపు రాకుండానే విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.  

ఈసారీ అదే తంతా? 
బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీ వల్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని ఫైర్‌ సేఫ్టీ విభాగం 2020లోనే స్పష్టం చేసింది. ఇలాంటి భవనాలు ఫైర్‌ సేఫ్టీ విభాగం నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 6–15 మీటర్ల ఎత్తున్న కాలేజీ భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ఫైర్‌ సేఫ్టీ విభాగం అనుమతినివ్వాలి. కానీ రాజధాని పరిసరాల్లో ఎక్కువగా 15 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాల్లో నడుస్తున్నాయి. 

రెండేళ్లుగా ఫైర్‌సేఫ్టీ విభాగం ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. అయినా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. పరీక్షల సమయం వరకూ విద్యార్థుల్లో టెన్షన్‌ నెలకొంటోంది. చివరకు ఒక్క సంవత్సరం కోసం అనుమతి ఇవ్వడం, వచ్చే ఏడాది నుంచి ఇవ్వబోమని చెప్పడం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి ఇలాంటి కాలేజీల అనుమతి నిలిపివేయాల్సి ఉంది. కానీ ఇలాంటి చర్యలేమీ బోర్డు తీసుకోలేదు. అఫ్లియేషన్ల విషయంలో తాత్సారం తగదని తల్లిదండ్రులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement