
సిద్ధమవుతున్న మావోయిస్టు అగ్రనేత కుటుంబ సభ్యులు
‘నంబాల’మృతదేహానికి పోలీసుల అంత్యక్రియలు
అస్థికలైనా ఇవ్వాలన్న కుటుంబ సభ్యులు
గుర్తింపుపై ‘డిక్లరేషన్’ కోరిన ఛత్తీస్గఢ్ పోలీసులు
మిగిలిన మావోయిస్టుల అస్థికల అప్పగింతపైనా సందిగ్ధత
అంత్యక్రియల వ్యవహారంపై జాతీయ మీడియాలో కథనాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 21న జరిగిన ఎన్కౌంటర్లో నంబాల చనిపోగా.. ఆయన మృతదేహానికి పోలీసులే 26వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అస్థికలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో.. మరోసారి వివాదం చెలరేగినట్టు బస్తర్, జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆదివాసీ శ్మశానవాటికలో..
ఈనెల 21న నంబాలతో పాటు 28మంది మావోయిస్టులు చనిపోగా అందులో 27మంది మృతదేహాలకు నారాయణపూర్ ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి మృతదేహాలు ఉన్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన మూడు అంబులెన్సులు 22వ తేదీ సాయంత్రం నాటికి నారాయణపూర్ చేరుకున్నాయి.
కాగా, మృతులతో తమకున్న రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు (ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఫొటో, సర్పంచ్ ధ్రువీకరణ పత్రం) సమర్పించలేదనే కారణంతో.. 26వ తేదీన సాయంత్రం పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశానవాటికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు ఛత్తీస్గఢ్ నక్సల్స్ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.
డిక్లరేషన్ పేచీ..
అంత్యక్రియలు జరిగిన మర్నాడు.. నంబాల కేశవరావు సోదరుడు నంబాల రామ్ప్రసాద్ ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించి తన సోదరుడి అస్థికలు ఇవ్వాలని కోరారు. కాగా, తమ కుటుంబ సభ్యుడేనని నిరూపించుకునేందుకు అవసరమైన చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లు డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని అక్కడి పోలీసులు సూచించినట్లు సమాచారం. దీనికి నిరాకరించిన నంబాల సోదరుడు మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
చివరి చూపైనా దక్కలేదు
ఎనిమిది మంది మృతదేహాలకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అందులో మావోయిస్టు హుంగీ కుటుంబ సభ్యులు.. తమ ఆర్థిక సమస్యల రీత్యా.. పోలీసులే నిర్వహించాలని కోరారు. కానీ అంత్యక్రియలకు ముందు ఒక్కసారైనా హుంగీ మృతదేహాన్ని తమకు చూపలేదని వారు వాపోయారు. ఏళ్ల తరబడి ఇంటికి దూరమై విగత జీవులుగా మారిన తమ వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్రీజర్ బాక్స్లున్న అంబులెన్సులు తెచ్చుకున్నామని, కానీ ఉత్త చేతులతో తిరుగు ముఖం పట్టాల్సి వచ్చిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 21న ఎన్కౌంటర్ జరిగితే.. 26వ తేదీ వరకు మృతదేహాలన్నీ ఆరుబయటే ఉన్నాయని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆస్పత్రి ప్రాంగణం, సమీపంలోని టీ కొట్లు, ఇతర దుకాణాలను మూసేశారని వెల్లడించారు. ఇంత జరిగినా తమ వారి చివరి చూపు కోసం పరితపిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు సహకరించలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల విషయంలో కేవలం ఆధార్కార్డు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాలు ఇచ్చారని.. తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల విషయంలోనే పేచీ పెట్టారని వారు వాపోతున్నారు.