పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక

PM Cares For Children Scheme Launched In Hyderabad - Sakshi

దేశవ్యాప్తంగా 9,042 దరఖాస్తులు

కరోనా వల్ల అనాథలైన పిల్లల కోసమే పథకం  

కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసమే పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ప్రతిమా భౌమిక్‌ తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌తో కలిసి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 557 జిల్లాల నుంచి 9,042 దరఖాస్తులు అందా యని, ఇందులో 4,345 మంది పిల్లలను పథకానికి ఎంపిక చేశామని తెలిపారు. వీరంతా కేంద్రం పరిధిలోని పాఠశాలల్లో ఉన్నత విద్యను అభ్యసిం చేలా స్కాలర్‌షిప్‌లు అందిస్తామని వెల్లడించారు. పథకానికి ఎంపికైన వారిలో ఖమ్మం జిల్లా నుంచి 14 మంది పిల్లలు న్నారని.. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వారు ముగ్గురు, 18 ఏళ్లలోపు వారు 11 మంది ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పీఎం కేర్‌ సర్టిఫికెట్లు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను మంత్రి అందజేశారు.

ఆ పిల్లల తల్లిదండ్రులను ఎలాగూ తీసుకురాలేం..: కిషన్‌రెడ్డి
కరోనా వల్ల అనాథలైన పిల్లలకు తల్లిదండ్రులను ఎలాగూ తీసుకురాలేమని, కానీ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ను కేంద్రం తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ పిల్లలకు స్నేహమిత్ర ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పథ కంపై హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.

‘పిల్లలు 23 ఏళ్ల వరకు ఏ కోర్సు చదువుకున్నా ఉచితంగా చదివిస్తాం. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో చేరొచ్చు. ప్రైవేటు పాఠశాలలో చేరితే స్కూలు ఫీజు చెల్లిస్తాం. నెలకు రూ. 4 వేలు వారి పేరు మీద అకౌంట్‌లో జమ చేస్తాం. 23 ఏళ్లు నిండిన వారికి రూ.10 లక్షలు డిపాజిట్‌ చేస్తాం’ అని వివరించారు. పథకం కింద 12 మంది పిల్లలను హైదరాబాద్‌ జిల్లా నుంచి దత్తత తీసుకున్నామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top