నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ' | Phone tapping case: KCR to visit Nandinagar for Inquiry | Sakshi
Sakshi News home page

నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'

Feb 1 2026 2:55 AM | Updated on Feb 1 2026 7:10 AM

Phone tapping case: KCR to visit Nandinagar for Inquiry

గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటి గోడపై నోటీసులు అంటించడం ఆక్షేపణీయం 

ఇది నా రాజ్యాంగ హక్కును కాలరాయడమే.. బాధ్యత కలిగిన వ్యక్తిగా దర్యాప్తునకు సహకరిస్తా.. 

మధ్యాహ్నం 3 గంటలకు సిట్‌ విచారణకు అందుబాటులో ఉంటా.. 

జూబ్లీహిల్స్‌ ఏసీపీకి కేసీఆర్‌ సుదీర్ఘ లేఖ 

నేడు ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు కేసీఆర్‌ రాక  

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్‌కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్‌పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నందినగర్‌ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్‌ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్‌ సుదీర్ఘ లేఖ రాశారు. 

సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. 
‘సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్‌ నందినగర్‌లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్‌ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. 

నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు 
‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్‌ స్టేషన్‌ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్‌ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

నేడు నందినగర్‌కు కేసీఆర్‌ 
ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో క్రైమ్‌ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్‌ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్‌ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్‌కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్‌ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్‌ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్‌ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్‌ ఆదివారం ఉదయం నందినగర్‌కు చేరుకోనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement