ఫస్ట్‌ నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు

Online Classes From September First In Telangana - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్‌ 1 నుంచి అమలుకు విద్యాశాఖ నిర్ణయం

టీవీ/టీశాట్‌ ద్వారా బోధన

వీడియో పాఠాల తయారీకి 27 నుంచి స్కూళ్లకు టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ తరగతులు మొదలుకానున్నాయి. ఆలోపు వీటికి సంబంధిం చిన ఆన్‌లైన్‌ క్లాస్‌ మెటీరియల్, వీడియో పాఠాలు వంటివి తయారు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులను ఆదేశించింది. దీని కోసం ఈనెల 27 నుంచి పాఠశాల సిబ్బంది విధు లకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అప్‌లోడ్‌పై లేని స్పష్టత..
కోవిడ్‌ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలకు మాత్రం ప్రభుత్వం నో చెబుతూ వచ్చింది. అయితే, విద్యా సంవత్సరం ఇబ్బందుల్లో పడకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు కూడా ఆన్‌లైన్‌ లేదా టీవీ/టీశాట్‌ ద్వారా బోధించేందుకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలి చ్చింది. 27వ తేదీ నుంచి పాఠశాలకు హాజరయ్యే టీచర్లు సబ్జెక్టుల వారీగా వీడియో పాఠాలను రూపొందించాలి. వీటిని విధ్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఎలా అప్‌లోడ్‌ చేయాలనే దానిపై మాత్రం విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు.

వీక్షించేది ఎందరో?
రాష్ట్రంలో 28 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వీటిలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే ఎంతమందికి వెసులుబాటు ఉంటుందనే దానిపై ఇటీవల విద్యాశాఖ పరిశీలన చేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు సేకరించింది. దాదాపు సగానికిపైగా విద్యార్థుల ఇళ్లలో టీవీలు, కేబుల్‌ లేదా డిష్‌ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే టీశాట్‌ ద్వారా పాఠాలను ఎంతమంది చూస్తారనే దానిపై ఎలాంటి అంచనాల్లేవు. మరోవైపు కనెక్షన్లు ఉన్నప్పటికీ నిర్దేశించిన సమయాల్లో చూసి అవగాహన చేసుకునే దానిపైనా స్పష్టత లేదు. పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు పూర్తిగా కొత్త. వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీచర్లకు తమ తమ పాఠశాలల్లోని పిల్లలకు వారి అవగాహన స్థాయిని బట్టి పాఠ్యాంశ బోధనను ఎలా చేపట్టాలో ఓ అంచనా ఉంటుంది. ఇప్పుడిది అందరికీ కలిపి సెంట్రలైజ్డ్‌ పద్దతిలో చేసే పాఠ్యాంశ బోధన. దీనివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెజార్టీ వ్యవసాయ కార్మికుల పిల్లలే. ప్రస్తుతం వ్యవసాయ పనులు కొనసాగుతుండడంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో విద్యార్థులు ఇళ్లలో ఉండి వీడియో పాఠాలు చూసే అవకాశాలు తక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top