
నిఘా ఉంచడానికి ఏర్పాటు చేయించిన ప్రభాకర్రావు
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్రావు
దీనికి దాదాపు 20 మంది ఎస్ఐబీ అధికారుల వినియోగం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ‘ఆర్ఆర్ మాడ్యుల్’పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్కు (ఎస్ఓటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్రావు దీనిని పర్యవేక్షించారని వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్రావు హయాంలో అనేకమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వీరి కోసం మాడ్యూల్స్ రూపొందించారు.
ఒక్కో మాడ్యుల్లో సదరు వ్యక్తితోపాటు ఆయనకు సంబంధించి ఇంకా ఎవరెవరివి ఫోన్లు ట్యాప్ చేయాలో ఆ నంబర్లు చేర్చేవారు. ఈ మాడ్యూల్ను అనునిత్యం పర్యవేక్షిస్తూ వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను పర్యవేక్షించడానికి కొందరు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డికి సంబంధించిన మాడ్యుల్కు ప్రభాకర్రావు ‘ఆర్ఆర్ మాడ్యూల్’అనే పేరు పెట్టారు.
ఈ మాడ్యూల్లో ఉన్న వారి ఫోన్లను పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. ప్రభాకర్రావు ఎస్ఐబీ చీఫ్గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. దీనివల్ల ఒనగూరుతున్న లాభాలు తెలిసిన తర్వాత ప్రభాకర్రావు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. ఎస్ఐబీ అధికారులు చాలా కాలం కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారు.
2018 తర్వాత మారిన ట్యాపింగ్ పంథా
2018 ఎన్నికల సందర్భం నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్రావు, తిరుపతన్న తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్రావు ట్యాపింగ్ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి.
ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. దీన్ని ప్రణీత్రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్రావు బృందం రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న వార్రూమ్లో ఏర్పాటు చేసి ‘ఆర్ఆర్ మాడ్యూల్’ను కొన్నాళ్లు పర్యవేక్షించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
నాలుగోసారి హాజరైన ప్రభాకర్రావు
ప్రభాకర్రావు గురువారం నాలుగోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ విచారణకు ప్రభాకర్రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడానికి ఉన్న అవకాశాలను న్యాయ నిపుణులతో పరిశీలిస్తోంది.