సాక్షి,హైదరాబాద్: తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇస్తామంటూ నమ్మించి నిలువునా ముంచిన ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ కస్టమర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా రూ. 10 కోట్ల విలువైన బంగారాన్ని కాజేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది.
బాధితుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ ఫేజ్-6 లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ప్రియాంక రెడ్డి బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఆమె కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ప్రియాంక రెడ్డి మాటలు నమ్మి సుమారు 40 మందికి పైగా కస్టమర్లు తమ వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సదరు బ్రాంచ్లో తాకట్టు పెట్టారు.
అయితే, కస్టమర్లు ఇచ్చిన బంగారాన్ని అధికారికంగా కాకుండా, వారి నుంచి వడ్డీ డబ్బులను తన వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, సదరు బంగారాన్ని తక్కువ వడ్డీ పేరుతో మరో ఫైనాన్స్ సంస్థకు అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం.
కొద్దిరోజుల తర్వాత కస్టమర్లు తమ లోన్ గడువు ముగిసి, అసలు చెల్లించి బంగారాన్ని తిరిగి ఇవ్వాలని మేనేజర్ ప్రియాంక రెడ్డిని కోరారు. ఆమె కాలయాపన చేస్తూ, బంగారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. తీరా నిలదీసేసరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు. కస్టమర్ల ఫిర్యాదుపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


