
అందుకే మేడిగడ్డ బరాజ్ కుంగింది
సికెంట్ పైల్స్ నిర్మాణంలో లోపంతోనే బుంగలు ఏర్పడి బరాజ్ కుంగింది
మరెన్నో బుంగలు ఏర్పడి ఉండొచ్చు.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగొచ్చు
సైట్ పరిశోధనలు, డిజైన్లు, నిర్మాణం, పర్యవేక్షణ అంతా లోపభూయిష్టం
అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం ఇదే తరహాలో లోపాలు
3 బరాజ్లపై అధ్యయనం చేయాలి
ఎన్డీఎస్ఏ తుది నివేదికలో స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షణ కొరవడటంతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తేల్చింది. బరాజ్ పునాదుల(ర్యాఫ్ట్) కింద సికెంట్ పైల్స్ను నీళ్లను నిలువరించేలా నిర్మించడంలో విఫలమైనట్టు నిర్ధారించింది. దీంతో ఇసుక భారీగా కొట్టుకుపోయి పునాదుల కింద పెద్దపరిమాణంలో బుంగలు ఏర్పడ్డాయని నిర్ధారించింది.
బరాజ్కి ఎగువన 20–21 పియర్ల మధ్య ఏర్పడిన భారీ గుంత, 17వ పియర్కి దిగువన ఏర్పడిన గుంతలే దీనికి సంకేతమని స్పష్టం చేసింది. సికెంట్ పైల్స్(కటాఫ్ వాల్స్) విఫలం కావడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని పేర్కొంది. బరాజ్లో ఇలాంటి బుంగలు మరిన్ని ఉండటానికి ఆస్కారముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవచ్చని హెచ్చరించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్ల సికెంట్ పైల్స్ నిర్మాణంలో సైతం ఇదే తరహా వైఫల్యాలున్నట్టు గుర్తించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యాలపై సుదీర్ఘ అధ్యయనం అనంతరం కమిటీ రూపొందించిన తుది నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించాక ఎన్నో లోపాలను గుర్తించినట్టు కమిటీ తెలిపింది. నిర్మాణానికి ముందు నిర్వహించిన సైట్ పరిశోధనలు, మోడల్ స్టడీస్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అండ్ జియోటెక్నికల్ డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నిర్వహణ, పర్యవేక్షణతోపాటు బరాజ్ రక్షణకి సంబంధించిన అంశాల్లో లోపాలున్నట్టు నిర్ధారించింది.
రెండు నెలల కిందే కేంద్రానికి నివేదిక
నిర్మాణ లోపాలకు తోడుగా బరాజ్ కింద బుంగలు ఏర్పడి ఇసుక కొట్టుకుపోవడం, దిగువ ప్రాంతంలోని అప్రాన్ సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతో 7వ బ్లాక్ కుంగిపోయి బరాజ్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని కమిటీ స్పష్టం చేసింది. బరాజ్లోని ఇతర బ్లాకుల్లో సైతం ఇలాంటి లోపాలే ఉండవచ్చని అంచనా వేసింది.
మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్ల డిజైన్లు, నిర్మాణంలో లోపాలుండటం, సమస్యలు ఉత్పన్నం కావడంతో అవి కూడా దుర్బల స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మూడు బరాజ్లపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరపాలని సిఫారసు చేసింది. బరాజ్లపై జరిపే పరీక్షలు, పరిశోధనల ఆధారంగా వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు, డిజైన్లను రూపొందించి అమలు చేయాలని కోరింది. ఎన్డీఎస్ఏ తుది నివేదికను రెండు నెలల కిందే కేంద్రానికి సమర్పించగా, గురువారం మీడియాకి అందింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
–ఎలాంటి సైట్ ఇన్వెస్టిగేషన్లు నిర్వహించకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లోకేషన్లు మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని నిపుణుల కమిటీ తప్పుబట్టింది.
–మేడిగడ్డ బరాజ్ డిజైన్ల తయారీ, నిర్మాణం కోసం నిర్వహించిన జియోటెక్నికల్ పరీక్షలు.. పునాదుల కింద భూగర్భంలోని వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఏ మాత్రం సరిపోవు.
– బరాజ్ 7వ బ్లాక్ కుంగడానికి కారణాలను విశ్లేíÙంచడానికి 22 బోర్ రంధ్రాలు చేసి జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించాలని ఎన్డీఎస్ఏ ప్రతిపాదించగా, కేవలం 9 రంధ్రాలు చేసి పరీక్షలు చేశారు. దీంతో కమిటీకి అవసరమైన సమాచారం ఈ పరీక్షల ద్వారా లభించలేదు.
–ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మూడు బరాజ్లను సందర్శించి చూడగా మూడింటిలోనూ గణనీయమైన రీతిలో నిర్మాణ లోపాలు కనిపించాయి.
–అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడి సీపేజీ జరిగింది.
–బరాజ్లకి మరింత నష్టం జరగకుండా గత వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలతోపాటు వైఫల్యాలను నిర్ధారించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేయగా, వాటిని తగిన రీతిలో చేయడంలో నీటిపారుదల శాఖ విఫలమైంది.
–అధ్యయన పరీక్షలకు ముందే మేడిగడ్డ బరాజ్ పునాదులకు బోర్హోల్ రంధ్రాలు చేసి గ్రౌటింగ్తో బుంగలను మూసివేయడంతో వైఫల్యానికి కారణాలు తెలిపే సాక్ష్యాధారాలకు నష్టం జరిగింది.
మేడిగడ్డ 7వ బ్లాక్ తొలగించాలి
మేడిగడ్డ బరాజ్లో కుంగిపోయిన 7వ బ్లాక్ను పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా తొలగించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సాధ్యం కాని పక్షంలో 7వ బ్లాకు స్థిరంగా ఉండేలా పటిష్టపరచాలని సూచించింది. రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా పక్కన ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పింది.