బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? | Mlc Kavitha Demand Establish Bayyaram Steel Plant | Sakshi
Sakshi News home page

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా?

Dec 12 2024 12:44 PM | Updated on Dec 12 2024 3:20 PM

Mlc Kavitha Demand Establish Bayyaram Steel Plant

సాక్షి,హైదరాబాద్‌ : బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎల్సీ కవిత డిమాండ్‌ చేశారు. 

బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తెలంగాణ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్‌ సభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడంపై కీలక వ్యాఖలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

 

 

‘బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి.  అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన.

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్‌ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. బీజేపీ కేంద్రంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement