ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం | minor girl end life in adilabad district | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

Jan 20 2026 8:37 AM | Updated on Jan 20 2026 8:37 AM

minor girl end life in adilabad district

కైలాస్‌నగర్‌ (బేల): ప్రేమ వ్యవహారం ఒకరిని బలితీసుకోగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఓ మైనర్‌ విద్యార్థిని పెద్దలు మందలించడంతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలియడంతో ప్రియుడు (మైనర్‌) సైతం పురుగు మందు తాగాడు. ప్రస్తుతం అతను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. 

జైనథ్‌ సీఐ శ్రావణ్‌ కుమార్, బేల ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ల కథనం ప్రకారం.. బేల మండలంలోని పాఠన్‌ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. జైనథ్‌ మండలంలోని ఆకుర్లకు చెందిన 17 ఏళ్ల బాలుడితో ఆమె ప్రేమలో పడింది. రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. దీంతో కుటుంబీకులు చదువుపై దృష్టి సారించాలని, ఈ వయసులో అలాంటి వాటికి దూరంగా ఉండాలని మందలించారు. 

పెద్దల మందలింపుతో మనస్తాపం చెందిన ఆ బాలిక సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి ఫోన్‌ ద్వారా తెలిపింది. ఇది తెలిసి ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ సమీపంలో ఆ బాలుడు సైతం పురుగు మందు తాగాడు. బాలుడి పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement