‘రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు’ | Minister Tummala Nageswara Rao Serious On Urea Irregularities | Sakshi
Sakshi News home page

‘రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు’

Jul 1 2026 10:30 PM | Updated on Jul 1 2026 10:30 PM

Minister Tummala Nageswara Rao Serious On Urea Irregularities

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ (యూరియా యాప్) ద్వారా ఎరువుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సాధ్యమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతున్నందున తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించామన్నారు.

సిద్దిపేట జిల్లాలో 6000 యూరియా బస్తాలు మాయమైనట్టు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్ సేల్ డీలర్లు మరియు ఒక రిటైలర్ లైసెన్స్‌ను వ్యవసాయ శాఖ రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యవసాయశాఖ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వలన ప్రభుత్వం అక్రమాలపై అనుసరిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నామన్నారు.

భవిష్యత్తులో కూడా యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని,  రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదని, ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. యూరియా పంపిణీని పూర్తిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని మంత్రి తెలిపారు.

రైతులకు సక్రమంగా అందాల్సిన యూరియాను ఎవరైనా అక్రమంగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో యాప్ వ్యవస్థ లేకపోవడం వల్ల అసలైన రైతులకు చేరాల్సిన యూరియాను కొందరు అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 5.62 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించగలిగామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందుబాటులోకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఇదంతా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

యూరియా యాప్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నప్పటికీ, రైతులు రోజురోజుకూ అధిక సంఖ్యలో యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేయడం ఈ యాప్ పై వారికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూరియా యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాల యూరియాను రైతులు బుక్ చేసుకోగా, అందులో 46.03 లక్షల బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 79.29 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను దుర్వినియోగం చేయడానికి లేదా అక్రమాలకు పాల్పడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement