
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు.
కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు.
పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.