హైదరాబాద్: నగరంలోనే అతిపెద్దదైన నల్లగొండ ఎక్స్రోడ్ స్టీల్ బ్రిడ్జి (సైదాబాద్) ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ స్టీల్ వంతెనను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మొదట మలక్పేట అక్బర్బాగ్లోని ఫైర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.
అనంతరం బ్రిడ్జి మీదుగా సీఎం కాన్వాయ్ సంతోష్నగర్–యాదిగిరి «థియేటర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అదే బ్రిడ్జి మీదుగా వచ్చి నల్లగొండ క్రాస్రోడ్ వద్ద యూటర్న్ తీసుకుని మలక్పేట ఫైర్ స్టేషన్, చంచల్గూడ జైలు రోడ్ మీదుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణకు చేరుకుంటుంది.
ఇక్కడ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రూ.620 కోట్ల వ్యయంతో 3.23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నగరంలోనే అతి పెద్దది. ఇంతకు ముందు ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు నిరి్మంచిన స్టీల్ బ్రిడ్జి 2.3 కి.మీ ఉండగా..సైదాబాద్ స్టీల్బ్రిడ్జి దీనిని అధిగమించనుంది. స్టీల్బ్రిడ్జ్ నిర్మాణం కింది భాగంలో ఇరువైపులా రహదారులను సైతం అధికారులు పూర్తిగా ఆధునీకరించారు. పచ్చదనం పెంపునకు కూడా చర్యలు చేపట్టారు.
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ప్రాజెక్టు అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అడిషనల్ డీసీపీ ఎంఏ మాజీద్ తదితరులు సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు.
చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నిర్వహించనున్న బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మలక్పేట, సైదాబాద్ ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు బ్రహ్మమురారి, వెంకట్రెడ్డి ఉన్నారు.

చదవండి: అనుమానంతో భార్యను చంపిన భర్త


