
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం
గ్రేటర్లోని 8 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులువు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త సంస్కరణలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా మహా హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ(గురువారం) నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. గ్రేటర్ పరిధిలోని ఆజంపుర, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రోజుకు కనీసం 48 స్లాట్లు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయా నికి కనీసం రోజు వారి పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజుదారులు నేరుగా registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తారు.
144 స్లాట్ల వరకు..
గ్రేటర్ పరిధిలో స్థిరాస్తి దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అత్యధికంగా స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ ఆఫీసుల్లో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించారు. ఈ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి.
చదవండి: శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
మరోవైపు స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని దష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేశారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట–సరూర్నగర్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశారు.
సొంతంగానే..
స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డ్యాకుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ని ప్రవేశపెట్టారు. మొదటగా సేల్ డీడ్ (Sale Deed) దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ (registration) ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ–సిగ్నేచర్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈనెల చివరిలోగా అందుబాటులోకి రానుంది.