కాంగ్రెస్‌, బీజేపీలకు కేటీఆర్‌ సవాల్‌ | KTR Serious Comments On Revanth Reddy And Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీలకు కేటీఆర్‌ సవాల్‌

Jun 3 2026 11:40 AM | Updated on Jun 3 2026 11:53 AM

KTR Serious Comments On Revanth Reddy And Congress

సాక్షి, సోమాజిగూడ: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి సాధించినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోని తప్పుకుంటానని సవాల్‌ చేశారు. ముఖ్యమంతి రేవంత్‌ రెడ్డి.. అందరినీ తొక్కేస్తా అంటూ నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశారని ఎద్దేవా చేశారు.  

మాజీ మంత్రి కేటీఆర్‌ తాజాగా సోమాజిగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..‘ఎన్నో పోరాటాలు, బలి దానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ పుట్టింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం పూర్తి అయ్యింది. తెలంగాణ పోరాట, త్యాగాలను స్మరించుకోవాలి. అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టేలా చేశాం. గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులను ని​ర్మించాం. 2014కు ముందు వలసలు, ఆత్మహత్యలు ఉండేవి. తెలంగాణ వచ్చాక వలసలను అరికట్టాం, ఆత్మహత్యలను నిర్మూలించాం. 

రైతుల ఆత్మహత్యలు నివారించాం. తెలంగాణను టాస్క్‌గా తీసుకున్నాం. కేసీఆర్‌ తెచ్చిన పథకాలను కేంద్రం సైతం కాపీ కొట్టింది. చివరకు మాపైనే అహంకారం అనే ముద్ర వేశారు. అధికారం పోయింది అనే బాధ మాకు లేదు. తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ మనపై రుద్దింది. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో 300 మంది అమరులను బలిగొన్నది కాంగ్రెస్. 2004లో కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ కథలో నంబర్-1 విలన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ ఆమరణ దీక్ష లేకపోతే తెలంగాణ లేదు. 2001లో పార్టీ పెట్టి ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి అన్న గుండె ధైర్యం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవచ్చు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాంతాలుగా విడిపోయినా కలిసి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా కేసీఆర్ పాలన సాగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో అనేక ప్రాజెక్ట్‌లను నిర్మించాం. తెలంగాణలో నాయకత్వ కెపాసిటీ ఉందా? అని అడిగిన వాళ్ళు మాకు కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండేది అనే పరిస్థితి వచ్చింది.

కేసీఆర్‌ తెలంగాణలో అమోఘమైన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి జరిగిందా?. కాంగ్రెస్‌, బీజేపీలకు సవాల్‌ విసురుతున్నా. ఇతర రాష్ట్రాల్లో ప్రగతి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఇస్తామన్నారు. మళ్లీ మూడు నెలల్లో పిల్లలు పుడతారా? అని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. 30 నెలలు అయినా హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని ఏమనాలి?. ఢిల్లీకి కప్పం కట్టడం ఒక్కటే రేవంత్ రెడ్డికి తెలుసు. కేసీఆర్ నామస్మరణ తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏంటి?. తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది’ అని ఘాటు విమర్శలు గుప్పించారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొక్కేస్తా.. తొక్కేస్తా అని నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశాడు. మా పదేళ్ల పాలనలో మేము రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారు. మంత్రులు పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేబినెట్‌లో మంత్రులకు శృతి, లయ లేదు. కాంగ్రెస్‌ ఫస్ట్‌ హాఫ్‌ డిజాస్టర్‌. రెండేళ్లలో కాంగ్రెస్‌ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బంతా ఏం చేశారు. దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కం ఇక్కడే ఎందుకు? అని ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement