
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ అందజేస్తున్న కొండా మురళి
క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీల లేఖ ఇచ్చిన మురళి
మంత్రి పొంగులేటి తమపై కక్షగట్టారని లేఖలో ప్రస్తావన!
మంత్రి సీతక్కతో విభేదాలు కడియం శ్రీహరి సృష్టిస్తున్నవే
మా నియోజకవర్గంలో రాజేందర్రెడ్డి జోక్యం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు.
ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.
మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా..
జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.
ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు.
అయినా ప్రకాశ్రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
జనగామలో కొమ్మూరి ప్రతాప్రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్ఘన్పూర్కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు.
మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదు
తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు.