
రూ.10 కోట్లు డిమాండ్
ముగ్గురు నిందితుల అరెస్ట్
పరారీలో మరో ముగ్గురు
వెంగళరావునగర్: రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఆఫీసుకు తీసుకెళ్లి, అనంతరం కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి నగదు డిమాండ్ చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్కుమార్ బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు.
ఈనెల 6న తన స్నేహితుడితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నడిచి వెళుతుండగా వెంకట్స్వరూప్ అనే వ్యక్తి అమీర్పేటలోని తన ప్లాట్కు రమ్మని మనోజ్కుమార్ను కారులో తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్కుమార్పై దాడిచేసి తుపాకులతో బెదిరించి ఎల్లారెడ్డిగూడలోని శివసాయి అపార్ట్మెంట్స్కు తీసుకెళ్ళారు. అక్కడ అతడిని బంధించి తమకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి భార్య, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు.
బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టగా వెంకటస్వరూప్ మరోసారి మనోజ్కుమార్ భార్యకు ఫోన్ చేసి మైత్రీవనం 1039 పిల్లర్ వద్దకు నగదు, తీసుకురావాలని చెప్పాడు. ఆమె పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు నిందితులు బైక్పై పారిపోగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు.