బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్పై పూల వర్షం కురిపిస్తున్న కార్యకర్తలు
ఎర్రవల్లి నుంచి నందినగర్ దాకా కేసీఆర్కు సంఘీభావం
రహదారి పొడవునా బీఆర్ఎస్ అధినేతకు పూలతో పార్టీ కేడర్ స్వాగతం
నందినగర్కు భారీగా తరలివచ్చినపార్టీ నేతలు, కార్యకర్తలు
విచారణ అనంతరం బయట వేచిఉన్న కేడర్కు కేసీఆర్ అభివాదం
పార్టీ నేతలతో భేటీ అనంతరం ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్లోని నందినగర్కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు.
ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు.
సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత....
ఎర్రవల్లి నుంచి నందినగర్కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోశ్తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు.
పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్
నందినగర్లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు.
మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు.
నినాదాలతో హోరెత్తిన నందినగర్
నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.
పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం
సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను కలివారు.
బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.


