పీవీకి భారతరత్న... సభలో తీర్మానం చేద్దాం..! | KCR Demands Bharat Ratna For PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

పీవీకి భారతరత్న... సభలో తీర్మానం చేద్దాం..!

Aug 29 2020 1:26 AM | Updated on Aug 29 2020 7:40 AM

KCR Demands Bharat Ratna For PV Narasimha Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరా బాద్‌ నడిబొడ్డున ఉన్న నెక్లెస్‌ రోడ్డును ఉద్యానవనా లతో పీవీ జ్ఞానమార్గ్‌గా అభివృద్ధి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన మెమోరి యల్‌ను నిర్మిస్తామన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామన్నారు. శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటు 
‘తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా, దేశంలోనే అనేక సంస్కరణలకు ఆద్యులుగా ప్రపంచం గుర్తించిన మహా మనిషి పీవీ. ఆయన మహోన్నత వ్యక్తిత్వంపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుతోపాటు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూని వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా పీవీ రచించిన పుస్తకాలతోపాటు ఆయన మీద ప్రచురితమైన పుస్తకాలను పీవీ కుమార్తె వాణిదేవి సీఎంకు అందజేశారు.

సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
►పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
►హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌. 
►విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం.
►అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు. 
►ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్‌ క్లింటన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని జాన్‌ మేజర్‌ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం.
►పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్‌ తయారు.  

Advertisement
 
Advertisement
Advertisement