జాబ్‌లో చేరగానే లక్షల జీతం కావాలని ఆశ.. ఇంటర్వ్యూలకు సెలక్ట్‌ అయినా... | Karimnagar Students Not Interested In Job At Chemical Company | Sakshi
Sakshi News home page

జాబ్‌లో చేరగానే లక్షల జీతం కావాలని ఆశ.. ఇంటర్వ్యూలకు సెలక్ట్‌ అయినా...

Feb 9 2023 12:22 PM | Updated on Feb 9 2023 1:04 PM

Karimnagar Students Not Interested In Job At Chemical Company - Sakshi

‘ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ కెమికల్‌ కంపెనీ విద్యార్థులకు రూ.16వేల జీతంతో ఉద్యోగాలు ప్రకటించగా.. కరీంనగర్‌కు చెందిన విద్యార్థులకు టాస్క్‌ ప్రతినిధులు, కళాశాలల వారు సమాచారమందించారు. ఇందులో చాలా మంది ఇంటర్వ్యూలకు హాజరవగా నలుగురు కూడా రిపోర్టు చేయలేదు. డిగ్రీ పూర్తి చేసినవారికి రూ.16 వేల జీతమిచ్చినా ఉద్యోగాల్లో చేరడం లేదు.’

‘ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఓ విద్యార్థినికి ఒక కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూకు పంపించిన తల్లిదండ్రులు వివిధ కారణాలు చెప్పి ఉద్యోగానికి పంపించలేదు. దీంతో కంపెనీవారు సదరు ఉద్యోగం వేరే వారికి కేటాయించారు. అయితే ఇన్ని రోజులు స్కిల్స్‌ నేర్చుకొని ఉద్యోగం సాధించిన విద్యార్థిని ఇంటివద్దే ఉండిపోయింది. ఇలాగే చాలా మంది ఏళ్ల తరబడి శిక్షణ పొంది పలు ఇంటర్వూ్యలకు హాజరవడం లేదు. మరికొందరు ఉద్యోగం వచ్చినా వెళ్లడం లేదు’.

కరీంనగర్‌: విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుదిద్ది ఉద్యోగాలు సాధించే దిశగా తయారు చేయాలని ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ని రూపొందించింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తో పాటు వివిధ కోర్సుల విద్యార్థులను, కళాశాలలను టాస్క్‌లో నమోదు చేయించి ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నమోదైన ప్రతీ కళాశాలలో టాస్క్‌ ఆధ్వర్యంలో విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కాగా శిక్షణ తీసుకున్న విద్యార్థులు అందివచి్చన ఉద్యోగ అవకాశాలను వదులుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల అనాసక్తి అని తెలుస్తోంది. 

ఉద్యోగాలపై అనాసక్తి...
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 కళాశాలలు టాస్క్‌లో నమోదు చేసుకున్నాయి. వీటిలో గతేడాది దాదాపు 2 లక్షల మంది నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 4,300 మంది నమోదు చేసుకున్నారు. టాస్క్‌ ప్రతినిధులు విడతల వారీగా కమ్యూనికేషనల్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, రెజ్యుమ్‌ సెట్టింగ్, ప్రజేంటేషన్‌ స్కిల్స్, అపిటిట్యూడ్, టీం వర్క్, గ్రూప్‌ డిస్కషన్, ప్రోగ్రామింగ్‌ టెక్నిక్స్‌తో పాటు విద్యార్థుల కోర్సులను బట్టి అవసరమయ్యే వివిధ రకాల నైపుణ్యాలు నేర్పిస్తున్నారు.

కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానం చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలు కోరుకునే స్కిల్స్‌లో పటిష్టంగా శిక్షణ ఇస్తున్నారు. కానీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్వూ్యల వరకు వెళ్లడం లేదు. టాస్క్‌ ప్రతినిధులు, కళాశాలల వారు సమాచారం అందించినా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా డిగ్రీ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నట్లు సమాచారం. జీతభత్యాలు లెక్కించి ఏమీ మిగలవని చెప్పి తల్లిదండ్రులే ఇంటి వద్దే ఆపేస్తుండగా, డిగ్రీతోనే లక్షల ప్యాకేజీ ఊహించుకున్న విద్యార్థులు కంపెనీలు అందిస్తున్న అవకాశాలను వదులుకుంటున్నారు. 

లక్షల్లో ప్యాకేజీలని ఊహలు
డిగ్రీ, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు కంపెనీలు ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు మొదట్లో తక్కువ వేతనాలు ప్రకటిస్తుండగా, జీతాలు రూ.లక్షల్లో ఊహించుకుంటున్న  విద్యార్థులు అటువైపు వెళ్లడంలేదు. పోటీ పడి స్కిల్స్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంపై ఆసక్తి చూపడం లేదు. తద్వారా రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. యువతరానికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించాలనే ప్రభుత్వ తపన వృథా అవుతుందని బాధపడుతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు వారి పంతా మార్చుకొని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. 

ఉద్యోగాల్లో చేరితేనే ఉజ్వల భవిష్యత్తు
టాస్క్‌లో నమోదైన విద్యార్థులకు ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలకు కావాలి్సన మెలకువలు నేర్పిస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ఇంటర్వూ్యలకు దూరం కాగా మరికొందరు ఉద్యోగాల్లో ఎంపికైనా జాయిన్‌ కావడం లేదు. తల్లిదండ్రులు పంపించకపోవడమూ ఒక కారణమే. డిగ్రీ త ర్వాత వేతనాలు మొదట్లో కొన్ని సంస్థల్లో తక్కువగా ఉండి తర్వాత పెరుగుతాయి. ఉద్యోగం చేస్తూ పోతే అనుభవం పెరిగిన కొద్ది వేతనాలు పెంచుతారు. ఉద్యోగం చేస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.    
 – గంగాప్రసాద్, టాస్క్‌ రీజనల్‌ కోఆరి్డనేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement