
ద్వితీయ శ్రేణి నగరాల్లోకళ తప్పుతున్న ఐటీ కేంద్రాలు
స్థానిక నిరుద్యోగులకు ఉపాధి,వృత్తి శిక్షణ లక్ష్యంగా ఏర్పాటు
పెద్ద కంపెనీలను రప్పించడంలో టీజీఐఐసీ నిర్లిప్తత
భవనాల నిర్మాణం, మౌలికసదుపాయాల కల్పనలో విఫలం
చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్లకేపరిమితమైన హబ్లు
కంపెనీలతో పాటు ఉద్యోగులూ తరలిపోతున్న వైనం.. పూర్తిగా కుంటుపడిన ‘టాస్క్’శిక్షణ కార్యక్రమాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రధాన నగరాలకు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నెలకొల్పిన ఐటీ హబ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఐటీ హబ్ల ఏర్పాటు ఉద్దేశం బాగున్నా.. ఆచరణలో ఆ మేరకు కృషి జరగడం లేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్ధతమవుతుంది.
సంస్థల కొనసాగింపు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) పట్టించుకోకపోవడంతో చిన్నచిన్న కంపెనీలే కొనసాగుతున్నాయి. ప్రముఖ కంపెనీలు ఇటు వైపు చూడక పోవడంతో స్థానిక నిరుద్యోగులుకు ఈ హబ్లు ఏమాత్రం ఉపయోగ పడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఉద్యోగులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ సైతం అందకుండా పోయింది.
రాష్ట్రంలో పలుచోట్ల హబ్లు..
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా గత ప్రభుత్వం ఐటీ హబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలుత వరంగల్లో ఆ తర్వాత కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్లగొండలో ఏర్పాటయ్యాయి. తొలినాళ్లలో టీజీఐఐసీ ప్రతినిధులు కంపెనీలతో చర్చలు జరిపారు. దీంతో పలు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి.
అలాగే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్) ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యంపై ఉద్యోగులు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తే మొదట్లో కార్యకలాపాలు బాగానే ఉన్నా ఆ తర్వాత కుంటుపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐబీఎం తదితర ప్రముఖ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు, మరికొన్ని చిన్న కంపెనీలే ఇక్కడ కొనసాగుతున్నాయి.
ఉద్యోగాల్లేవు.. సరైన వేతనాల్లేవు
పెద్దగా కంపెనీలు రాకపోవడంతో ఈ హబ్ల్లో పెద్దగా ఉద్యోగావకాశాలు లభించడం లేదు. మరోవైపు ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం పొందిన వారు.. ఎక్కువగా చిన్న కంపెనీలే కావడంతో వేతనాలు తక్కువగా వస్తున్నందున కొన్నాళ్లు పనిచేయగానే హైదరాబాద్, బెంగళూరు బాట పడుతున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గి ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి.
ఇక ఖమ్మం తదితర ఐటీ హబ్ల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని రోజువారీ పారిశుధ్యం కూడా సక్రమంగా సాగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అప్పట్లో టీఎస్ఐఐసీ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ హబ్లను కూడా పర్యవేక్షించింది. కానీ క్రమంగా వీటిని పట్టించుకోవడం మానేసింది. శ్రద్ధ తగ్గడంతో హబ్ల ఏర్పాటు లక్ష్యం నీరుగారింది. ఇక ‘టాస్క్’ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన శిక్షణ కూడా కొరవడిందని ఉద్యోగులు తెలిపారు.
తగ్గిన కంపెనీలు..ఉద్యోగులు
ఖమ్మం ఐటీ హబ్లో కంపెనీలు, ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2020 డిసెంబర్ 7న మొదటి దశ కార్యకలాపాలు మొదలు కాగా 19 కంపెనీలు ఉండేవి. 720 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ప్రముఖ కంపెనీలేవీ లేకపోగా, కొన్ని కంపెనీల బ్రాంచ్లే ఉండడంతో వేతనం తక్కువగా వస్తోందని ఉద్యోగులు ఇతర కంపెనీల బాట పట్టారు. ప్రస్తుతం 14 కంపెనీల్లో 400 మంది ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఇక 2021 ఏప్రిల్ 2న రూ.36 కోట్ల వ్యయంతో రెండో దశ నిర్మాణాన్ని ప్రారంభించినా పనులు పూర్తి కాలేదు.
డంపింగ్ యార్డ్ సమీపంలో..
హనుమకొండ జిల్లా మడికొండలో ఇంక్యుబేషన్ సెంటర్ను 2016లో ఏర్పాటు చేశారు. తొలుత సెయింట్ ఐటీ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆపై జెన్ప్యాక్ట్ ఐటీ సంస్థ 200 మంది ఉద్యోగులతో నడుస్తోంది. గతంలో విన్టోస్, టెక్ మహీంద్రా, కాకతీయ సొల్యూషన్ కార్యలాపాలు మొదలుపెట్టినా ఇప్పుడు పని చేయ డం లేదు, టెక్ మహీంద్రా హైదరాబాద్కు తరలిపోయింది. ఐటీ సెంటర్కు దగ్గరగా డంపింగ్ యార్డు ఉండడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఐటీ సంస్థలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
కంపెనీలు ఉన్నా..
సిద్దిపేటలో 2023లో 12 కంపెనీలు, 278 మంది ఉద్యోగులతో ఐటీ హబ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం 13 కంపెనీలు ఉన్నా.. 181 మంది ఉద్యోగులే ఉన్నా రు. అయితే, పలు కంపెనీలకు ప్రాజెక్టులు లేవు. మూడు నెలల క్రితం ఇంటర్నెట్ బిల్లు చెల్లించక పోవడంతో కనెక్షన్ తొలగించారు. 2 రోజుల పాటు అంతరాయం ఏర్పడటంతో పలు కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితమయ్యారు.
ఇవి రెండూ అలంకారప్రాయమే..
నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత 10 – 12 చిన్న కంపెనీలు రాగా.. 239 మంది ఉద్యోగులు పనిచేసేవారు. వచ్చిన కంపెనీలు వెళ్లిపోవడం, మరికొన్ని చిన్న కంపెనీలు రావడం తప్పితే పెద్దగా మార్పు లేదు. వేతనాలు తక్కువ ఇస్తుండటంతో చాలామంది పనిచేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
అలాగే, సూర్యాపేట ఐటీ హబ్లో కార్యకలాపాలు కొనసాగడం లేదు. 2023 ఆగస్టులో మంత్రి కేటీఆర్ పాత కలెక్టరేట్లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మొదటి విడతలో 350 మందిని ఎంపిక చేసి మూడు నెలలు శిక్షణ ఇచ్చాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
ఆదిలాబాద్లో పూర్తి కాని భవనం
ఆదిలాబాద్ జిల్లాలో 2022లో హబ్ ప్రారంభమయ్యింది. ఎన్టీటీ బిజినెస్ డేటా సొల్యూషన్స్, బీడీ ఎన్టీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇక్కడ ఐటీ హబ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ కార్యాలయ భవనంలో తాత్కాలికంగా ఎన్టీటీ డేటా కంపెనీ ప్రారంభమైంది. మొదట్లో 87 మందితో మాత్రమే ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 265 మంది ఉద్యోగులు ఉన్నారు.
11 కంపెనీలు 42 మంది ఉద్యోగులు
నిజామాబాద్ జిల్లాలో 2023 సెపె్టంబర్ 23న ఐటీ హబ్ ప్రారంభమైంది. తొలుత 17 కంపెనీలు ఉండగా 436 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 11 కంపెనీలు కొనసాగుతుండగా, 42 మంది ఉద్యోగులే మిగిలారు. ఎక్కువ మంది హైదరాబాద్లో ఉద్యోగానికి మొగ్గు చూపడంతో దశల వారీగా కంపెనీలను అక్కడకు మార్చారు.