సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలు సిద్దం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 25 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18తో ఇవి ముగుస్తాయి. అయితే పరీక్షల సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మెుత్తంగా 9,97,075 మంది పరీక్షలకు హాజరవుతుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది కాగా ద్వితీయ సంవత్సరం 5,07,949 మంది అని ఇంటర్ బోర్టు తెలిపింది.
ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందు గానే చేరుకోవాలని తెలిపింది. పరీక్షలు పకడ్బందీగా జరగడానికి 7,500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రాలలో ప్రత్యేకంగా తాగునీరు, ఫర్నీచర్, గోడ గడియారాలు అధికారులు తెలిపారు.
మానసిక ఒత్తిడికి టెలిమానస్
పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు లోనయితే సైకాలజిస్టుల సలహాలు తీసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. అందుకోసం 14416 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయాలని పేర్కొంది. ఈ సేవలు నిరంతరాయంగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.


