ఇక ఆపుకోనక్కర లేదు | Indian Railways Enhances Loco Pilots Comfort With Air-Conditioned Running Rooms and Ergonomic Cabs And New Safety Features | Sakshi
Sakshi News home page

ఇక ఆపుకోనక్కర లేదు

Apr 20 2025 1:31 AM | Updated on Apr 20 2025 1:31 AM

Indian Railways Enhances Loco Pilots Comfort With Air-Conditioned Running Rooms and Ergonomic Cabs And New Safety Features

లోకోపైలట్లను కరుణించిన రైల్వే శాఖ.. లోకోమోటివ్‌లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్‌ సీట్లు

కొత్త, పాత ఇంజిన్లలో ఏర్పాటుకు ఆదేశం 

మొదలైన పనులు.. 42 లోకోల్లో బిగింపు 

లోకో, సహాయ లోకోపైలట్లకు ఉపశమనం

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి.. మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందనే భయం. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్‌ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా పట్టొచ్చు. ఇది రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్లు, సహాయ లోకోపైలట్ల దుస్థితి.

ముఖ్యంగా మహిళా లోకోపైలట్ల ఆవేదనపై సాక్షి పత్రిక ‘ఆపుకోలేని ఆవేదన’పేరిట కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల ఇంజిన్‌ క్యాబిన్‌ (లోకో)లలో యూరినల్స్, ఏసీ వసతి, ఆధునిక ఎర్గోనామిక్‌ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీంతో లక్షన్నర మంది లోకో, అసిస్టెంట్‌ లోకోపైలట్లకు పెద్ద ఉపశమనం లభించనుంది.  

యూరినల్స్‌ ఏర్పాటు ప్రారంభం 
కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్‌లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్‌ సీట్ల ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్‌లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని లాలాగూడ, మౌలాలి లోకోòÙడ్లతోపాటు కాజీపేట, విజయవాడ, గుత్తిలలోని లోకోòÙడ్లలో ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్సు రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే 42 లోకోమోటివ్‌లలో ఏర్పాటు చేశారు. ఇంజిన్‌ను పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్‌లో చిన్న క్యాబిన్‌ ఏర్పాటుచేసి, అందులో యూరినల్స్‌ కమోడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. లోకోమోటివ్‌లలో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్‌ కాకుండా యూరినల్స్‌ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్‌ నాలుగు రోజులకోసారి స్పెషల్‌ క్లీనింగ్‌కు షెడ్డుకు వెళ్తుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్ధాలను తొలగిస్తారు. కానీ, లోకోమోటివ్‌ 90 రోజులకోసారి మాత్రమే షెడ్డుకు వెళ్తుంది. అప్పటి వరకు వ్యర్ధాలు నిల్వ ఉంచలేరు.  

ఎర్గోనామిక్‌ సీట్లు.. 
గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము, వెన్నెముఖ నొప్పులొస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్‌ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు.  

మంచినీళ్లు కూడా తాగేవాళ్లం కాదు
పురుషులతో సమానంగా ఈ కష్టతరమైన పనిచేయటాన్ని సవాల్‌గా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరా. కానీ లోకోమోటివ్‌లలోని ప్రతికూల పరిస్థితులు ఈ సవాల్‌ను మరింత కఠినతరం చేశాయి. మంచినీళ్లు తాగితే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వస్తున్నాం. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం మాకు పెద్ద వరం లాంటిదే. - డి.దుర్గాభవాని, సీనియర్‌ అసిస్టెంట్‌ లోకోపైలట్‌

టాయిలెట్‌ వసతి కూడా  ఏర్పాటు చేయాలి 
దశాబ్దాల మా సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. యూరినల్స్‌కే పరిమితం కాకుండా, టాయిలెట్‌ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టవుతుంది.  - పి.రవీందర్, చీఫ్‌ లోకో ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement