బాణాసంచాకు బోలెడు కష్టాలు! | impact of elections this time on Diwali fireworks | Sakshi
Sakshi News home page

బాణాసంచాకు బోలెడు కష్టాలు!

Oct 31 2023 3:54 AM | Updated on Oct 31 2023 3:55 AM

impact of elections this time on Diwali fireworks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి బాణాసంచాపై ఈసారి ఎన్నికల ప్రభావం స్పష్టంగా కని్పస్తోంది. ఎన్నికలు కూడా కలిసి రావడంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే అడుగడుగునా నిఘా నేపథ్యంలో వాటిని తీసుకురావడమూ కష్టంగానే ఉందని దుకాణాల యజమానులు అంటున్నారు. నగదు లావాదేవీలకు అడ్డంకులతో వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు.

ఈ సంవత్సరం బాణాసంచా ధరలు పెరగడానికి ఇది కూడా కారణమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దసరాకు ముందు నుంచే వ్యాపారులు బాణాసంచాను తమిళనాడులోని శివకాశి నుంచి భారీగా తెచ్చి, నిల్వ చేస్తుంటారు. దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచి అమ్మకాలు మొదలు పెడతారు. పండుగకు నాలుగు రోజుల ముందు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఏటా రూ. 250–360 కోట్ల వ్యాపారం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 500–700 కోట్ల వ్యాపారం ఉంటుందని అంచనా. ఇందులో పన్నులు చెల్లించకుండా జరిగే వ్యాపారమే ఎక్కువగా ఉంటుందని అంచనా. 

ఈ ఏడాది టపాసుల జోరు.. 
రాష్ట్రంలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు వివిధ వర్గాలతో కలిసి వేడుకల్లోనూ పాల్గొంటారు. పారీ్టలన్నీ మండల, నియోజకవర్గ స్థాయిలో ఆఫీసులను తెరుస్తాయి. దీంతో కార్యకర్తలు పోటీపోటీగా బాణాసంచా కాల్చడం రివాజు. డిసెంబర్‌ మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. విజయం సాధించిన అభ్యర్థులు బాణాసంచాతో పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటారు.

దీపావళికి ఎన్నికలు కూడా తోడవ్వడంతో ఈసారి బాణాసంచా అమ్మకాలు జోరుగానే ఉంటాయని వ్యాపారులు విశ్లేíÙస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో శివకాశిలో ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు హైదరాబాద్‌ మలక్‌పేటకు చెందిన ఓ బాణాసంచా వ్యాపారి ఖండేవాల్‌ తెలిపారు. బాణాసంచాలో దాదాపు 50 శాతానికి పైగా లాభాలుంటాయి. అధికారిక లెక్కల్లో చూపించే వాటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు కడతారు. అంతకు రెండు రెట్లు ఎలాంటి పన్నులు కట్టకుండా తేవడం సాధారణంగా జరుగుతున్న వ్యవహారమే. 

నగదుతో చిక్కు.. 
వ్యాపారులు ప్రతి ఏటా ఆన్‌లైన్‌ లావాదేవీలకన్నా, ప్రత్యక్షంగా నగదు ఇచ్చి బాణాసంచా కొనుగోలు చేస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులు దాటి నగదు తీసుకెళ్లడం కష్టంగానే ఉందని హైదరాబాద్‌ బాణాసంచా వ్యాపారి సంజయ్‌ తెలిపారు. రూ. 50 వేలకు మించి నగదు పట్టుబడితే స్వా«దీనం చేసుకుంటున్నారు. ఇదే సమస్యగా మారిందని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపైనా నిఘా ఉందనేది వ్యాపారులను వణికిస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సరిహద్దుల్లోనే కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. శివకాశిలోని వ్యాపారులకు ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపులను తెలిసిన వాళ్ల ద్వారా చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. అయితే, అక్కడా సమస్యలు తప్పడం లేదంటున్నారు.

డిజిటల్‌ లావాదేవీల వల్ల పన్నులు అధికంగా చెల్లించాల్సి వస్తోందన్న నెపంతో శివకాశిలోని వ్యాపారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు నిఘాలేని పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని చోట్ల తెలిసిన అధికారులను పట్టుకుని నగదు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది బాణాసంచా ధరలు 30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. నిఘా కారణంగా అయ్యే ప్రత్యేక ఖర్చు వల్ల ఈ సంవత్సరం స్థానికంగా ధరలు 50 శాతం పెరగవచ్చనేది వారు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement