Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో పర్యావరణం పారా హుషార్‌! | Hyderabad: Pollution Threat From Ganpati Immersion | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో పర్యావరణం పారా హుషార్‌!

Sep 2 2022 2:17 AM | Updated on Sep 2 2022 2:45 PM

Hyderabad: Pollution Threat From Ganpati Immersion - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల వీలును బట్టి మూడు, అయిదు, ఏడు, తొమ్మిది రోజుల్లో వినాయక నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో నగరంలో పలు జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్, ఇతర రసాయనాలతో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల భారీగా జలాశయాలకు కాలుష్య ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సే న్‌సాగర్‌ సహా నగరంలోని పలు  చెరువుల్లో నిమజ్జనం చేయనుండడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హానికారక రసాయనాలు, మూలకాలివే.. 
రసాయన రంగుల అవశేషాలు: లెడ్‌ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్‌ ఆక్సైడ్, రెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్, రెడ్‌ లెడ్, క్రోమ్‌ గ్రీన్, పైన్‌ ఆయిల్, లిన్సీడ్‌ ఆయిల్, లెడ్‌ అసిటేట్, వైట్‌ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్‌.

హానికారక మూలకాలు: కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్‌ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్‌ పౌడర్స్, బేరియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్‌ ఆర్సినిక్, జింక్‌ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.

జలాశయాల కాలుష్యంతో అనర్థాలు.. 
ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి.  

చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జలాల్లో అరుదుగా పెరిగే వక్షజాతులు అంతర్థానమవుతాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్‌లు జలాశయాల ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి.  

ప్రత్యామ్నాయాలివీ.. 
రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన గంట వ్యవధిలోనే తొలగించాలి. నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకి పూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్‌ కవర్లను పడవేయరాదు. పీఓపీ విగ్రహాల సంఖ్యను ఏటా తగ్గించాలి. మట్టి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement