టాప్లో శేరిలింగంపల్లి.. గతంతో పోల్చితే తగ్గిన దరఖాస్తులు
క్రమబద్ధీకరణ దరఖాస్తులు 58 వేలపైనే
శివార్ల నుంచే అత్యధికం
ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఆక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మహానగర పరిధిలో దాదాపు 58 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడేళ్ల క్రితం విడుదల చేసిన జీవోలు 58, 59లకు అనుబంధంగా తాజాగా జీవో 14 విడుదల చేసి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో క్రమబద్ధీకరణకు నోచుకొని అక్రమిత నివాస స్ధలాల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.
గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. అందులో సైతం నగర శివార్లు శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్మేట్, బాలపూర్, సరూర్నగర్, షేక్పేట, హయత్నగర్ మండలాల్లో అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం మీద గతంలో 1.66 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి అందులో 35 శాతానికి పడిపోయాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డిలో 31,830, ఆ తర్వాత మేడ్చల్లో 14,500కు పైగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలో జీవో 58, 59 కింద దరఖాస్తులు ఇలా:
శేరిలింగంపల్లి 9854, అబ్దుల్లాపూర్మెట్ 5990, బాలాపూర్ 4494, సరూర్నగర్ 3669, షేక్పేట 2980, హయత్నగర్ 2471, ఖైరతాబాద్ 1987, గండిపేట 1741, ఆసీఫ్నగర్ 1732, రాజేంద్రనగర్ 1527, సైదాబాద్ 1147, శంకర్పల్లి 883, ముషీరాబాద్ 751, మారేడుపల్లి 706, సికింద్రాబాద్ 458, ఇబ్రహీంపట్నం 354, అంబర్పేట 265, మహేశ్వరం 246, బండ్లగూడ 236, హిమాయత్నగర్ 202, శంషాబాద్ 166, గోల్కొండ 114, నాంపల్లి 113, బహదూర్పురా 87, ఆమన్గల్ 87, అమీర్పేట 86, మొయినాబాద్ 67.