
రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు
చాలాచోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్
తేమశాతం పెరగటంతో తీవ్ర ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భగభగమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతు న్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్ర తలు తార స్థాయికి చేరాయి. మరోవైపు గాలిలో తేమ శాతం కూడా పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. బుధవారం నిజామాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
కనిష్ట ఉష్ణో గ్రత మెదక్లో 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డయ్యాయి. నిజామాబాద్లో 3.6, ఆదిలాబాద్లో 3.4, ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట జన సంచారం తగ్గింది. అత్యవసరమైతేనే ప్రజలు బయ టకు రావాలని, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో రాత్రిపూట కూడా వేడి తగ్గటంలేదు.