సీఎం, మంత్రులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ 

Good Governance Says CM And Ministers Criminal Case Pending In High Court - Sakshi

ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలి..

హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పిల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రితోపాటు ఏడుగురు మంత్రుల మీద క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ కోర్టును కోరింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ‘10 మంది ఎంపీల మీద 133 కేసులు, 67 మంది ఎమ్మెల్యేల మీద 150,  గోషామహల్‌ ఎమ్మెల్యే మీద 43, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే మీద 14, కరీంనగర్‌ ఎమ్మెల్యే మీద 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ కేసులకు స్పెషల్‌ కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత న్యాయస్థానం అనుమతి లేకుండా కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి వీల్లేదు, అయినా ప్రభుత్వం కేసులను ఉపసంహరిస్తూనే ఉంది. స్థానిక పోలీసులు సాక్ష్యులను కోర్టుల ముందు హాజరుపర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలి. స్పెషల్‌ కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కేసుల విచారణ పురోగతిని నెల రోజులకొకసారి హైకోర్టుకు సమర్పించేలా ఆదేశించండి’అని పిటిషన్‌లో కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top