తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ | Gadwal Sp Reveals Key Details In Surveyor Tejeshwar Case | Sakshi
Sakshi News home page

తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ

Jun 26 2025 1:11 PM | Updated on Jun 26 2025 1:36 PM

Gadwal Sp Reveals Key Details In Surveyor Tejeshwar Case

జోగులాంబ గద్వాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు చేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమల రావుతో పాటు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఏ 1గా తిరుమల రావు, ఏ 2గా ఐశ్వర్య, ఏ8 సుజాతలను చేర్చారు. 

కాగా, పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్‌ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.

దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్‌ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్‌ రావు, సుపారీ గ్యాంగ్‌ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్‌ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.

ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్‌ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్‌ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్‌ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు.  

ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల‌రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement