ఉపాధికి హామీ పెరగాలి | Employment guarantee workers in the state have hopes for the new budget | Sakshi
Sakshi News home page

ఉపాధికి హామీ పెరగాలి

Jan 31 2025 1:11 AM | Updated on Jan 31 2025 1:11 AM

Employment guarantee workers in the state have hopes for the new budget

కేంద్ర బడ్జెట్‌లో నిధులు పెంచాలి 

రోజు కూలిని రూ.600కు పెంచాలి 

పని దినాలు 100 నుంచి 200కు పెంచాలి 

గతంలో మాదిరిగా అలవెన్స్‌లు ఇవ్వాలి 

రాష్ట్రానికి ఈ పథకంలో నిధులు డబుల్‌ చేయాలి 

కూలీలు, ఇతర వర్గాల నుంచి డిమాండ్లు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త బడ్జెట్‌పై రాష్ట్రంలోని ‘ఉపాధి’కూలీలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు అమలుచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) వచ్చే బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచాలని కోరుతున్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో కూలీలను ఆదుకుంటున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రధాన్యం ఇవ్వాలని మేధావులు, ప్రజాసంఘాల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.  

వాస్తవానికి దూరంగా నిధుల కేటాయింపు 
దేశంలోని కోట్ల మంది పేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగటంలేదనే అభిప్రాయాలున్నాయి. దేశంలోని అర్హులైన కూలీలందరికి (యాక్టివ్‌ హౌస్‌హోల్డ్స్‌) పథకంలో పొందుపరిచినట్లుగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు ఉపాధి కల్పించాలంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు అవసరమని అంచనా.

 కానీ, కేంద్రం 2024–25 వార్షిక బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.86,000 కోట్లు మాత్రమే. 2023–24లో మరీ తక్కువగా రూ.60 కోట్లే కేటాయించింది. తర్వాత దానిని రూ.86 వేల కోట్లకు సవరించింది. అయితే, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అయిన మొత్తం వ్యయం రూ.1,05,000 కోట్లుగా తేలింది. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గటంతో ఈ పథకం అమలు పలు రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రభావితమైంది. 

కూలీలందరికి నిర్దేశిత 100 రోజుల పని కల్పించటం సాధ్యం కాలేదు. అయితే తెలంగాణలో మాత్రం లక్ష్యానికి మించి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే దాదాపు రెండుకోట్ల పనిదినాలు అదనంగా చేశారు. ఈ అధిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు పెంచాలని కోరుతున్నారు.

నిధులు డబుల్‌ చేయాలి 
ఉపాధి పథకంలో రాష్ట్రానికి కేంద్రం రూ.4,416 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం ఇక్కడున్న పని డిమాండ్‌కు ఏమాత్రం సరిపోదు. చురుకుగా పనిచేస్తున్న కూలీలందరికీ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలంటే రూ.9,800 కోట్లు అవసరం. 

జాతీయ స్థాయిలోని యాక్టివ్‌ హౌస్‌ హోల్డ్స్‌కు పూర్తిస్థాయిలో పని కల్పించాలంటే బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల 2025–26 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి భారీగా కేటాయించాలి. తెలంగాణకు నిధులు రెండింతలు చేయాలి.  – చక్రధర్‌ బుద్దా, డైరెక్టర్, లిబ్‌టెక్‌ ఇండియా.

పని ప్రదేశంలో వసతులు కల్పించాలి
ఉపాధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌గా పనులు కల్పించాలి. పనికి దరఖాస్తులు తీసుకోవాలి. కూలీల సంఖ్యకు తగ్గట్టుగా షెల్ఫ్‌ ఆఫ్‌ వర్క్స్‌ క్రియేట్‌ చేయాలి. పని వద్ద హక్కుగా నీరు, నీడ, మెడికల్‌ కిట్‌లు ఏర్పాటు చేయాలి. పనిముట్లు పంపిణీ చేయాలి. 

వేసవి అలవెన్సు, తాగునీటి చార్జీలను గతంలో మాదిరిగా చెల్లించాలి. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను మళ్లీ నియమించాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖæ మంత్రి ప్రతి నెలా ఈ పథకం అమలు తీరును సమీక్షించాలి.   – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్‌ (డీబీఎఫ్‌) జాతీయ కార్యదర్శి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement