గ్రేటర్లో 20 శాతం లోటు వర్షపాతం
మరింత లోతులోకి భూగర్భ జలం
తూర్పున పరిస్థితి ఆందోళనకరం
సీజన్లో మిగిలిన 41 రోజులపైనే ఆశలు
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో ఎల్నినో మబ్బుల్లో మాన్సూన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సగటున 20 శాతం తక్కువగా నమోదు కాగా, తూర్పు ప్రాంతాల్లో మాత్రం లోటు 36 శాతం స్థాయికి చేరుకుందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ చినుకుల తీవ్రత తగ్గి.. 10 నుంచి 20 నిమిషాల వరకే వర్షం పరిమితమవుతోంది. ఫలితంగా భూమి సరిగా తడవకపోవడంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి.
నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తాయి. ఈ ఏడాది జూన్¯ 8న ప్రవేశించి, 23 నాటికి పూర్తిగా విస్తరించినా.. జూన్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. జూలైలో కొంత మెరుగుదల కనిపించినా ఆగస్టులో మళ్లీ లోటు పెరిగింది. ఈ సీజన్లో మరో 41 రోజులు మిగిలి ఉన్నప్పటికీ సాధారణ లోటుకూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
లోతుకు భూగర్భ జలాలు..
ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఊహించని విధంగా 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నాటి వర్షానంతర కాలంతో తాజా నివేదికలను పోల్చి చూస్తే భూగర్భ జలమట్టాలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. అత్యధికంగా తూర్పు ప్రాంతంలో సగటు నీటి మట్టం 6.51 మీటర్లు మాత్రమే ఉండగా, ఆగస్టు నాటికి అది ఏకంగా 14.03 మీటర్లకు పడిపోయింది.
బోరుబావుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటమే ఈ తీవ్ర క్షీణతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో మిగిలి ఉన్న రోజుల్లో సుదీర్ఘ, తీవ్రమైన వర్షాలు కురిస్తేనే భూజలాలు పెరిగే అవకాశముంది. లేనిపక్షంలో క్యూర్ పరిధిలో నీటి ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


