హైదరాబాద్‌లో ఎకో టౌన్‌! | Eco Town soon in Hyderabad: Telangana | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌!

Apr 21 2025 4:32 AM | Updated on Apr 21 2025 4:32 AM

Eco Town soon in Hyderabad: Telangana

ఆదివారం కిటాక్యుషు నగర సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి, మేయర్‌ కజుషియా టేకుచి

కిటాక్యుషు–హైదరాబాద్‌ మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందంపై చర్చ

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, పర్యావరణ పునరుద్ధరణలో సహకారం.. సర్క్యులర్‌ ఎకానమీ కార్యకలాపాల్లో కూడా.. 

జపాన్‌ కంపెనీలతో సీఎం రేవంత్‌ బృందం ఎల్‌ఓఐ ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఎకో టౌన్‌ ఏర్పాటు, అలాగే సర్క్యులర్‌ ఎకానమీ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, పర్యావరణ పునరుద్ధరణ వంటి రంగాల్లో సహకారం కోసం ప్రముఖ జపనీస్‌ ఎకో టౌన్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) రూపంలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది.

ఈఎక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పన్‌ స్టీల్‌ ఇంజనీరింగ్, న్యూ కెమికల్‌ ట్రేడింగ్, అమిటా హోల్డింగ్స్‌ వంటి కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జపాన్‌ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రైజింగ్‌ బృందం ఆదివారం అక్కడి కిటాక్యుషు నగరాన్ని సందర్శించి ఈ మేరకు పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్, కిటాక్యుషు నగరాల మధ్య బలమైన బంధానికి ఈ ఒప్పందాలు నిదర్శనమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

రెండు నగరాల మధ్య పరస్పర సహకారం కోసం మేయర్‌ కజుషియా టేకుచి ఆలోచన మేరకు ‘సిస్టర్‌ సిటీ’ఒప్పందం చేసే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. సత్వర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల తామే నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ ఏర్పాటుకు కలిసి పనిచేయనుండడంపై ఆనందం వ్యక్తం చేశారు.  

నగరాలు, సమాజాల మధ్య వారధి కోసం.. 
‘రెండు నగరాలు, సమాజాల మధ్య వారధి నిర్మించడానికి మనం చేతులు కలిపాం. ఇది భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరం. స్వచ్ఛత, పచ్చదనం, సుస్థిరత, సర్క్యులర్‌ ఎకనామీ మన ఉమ్మడి లక్ష్యాలు. చిత్తశుద్ధితో చేసే ఆవిష్కరణలతో ఏం సాధించగలమో మీ పర్యావరణహిత నగరం చూస్తే అర్థం అవుతోంది. హైదరాబాద్‌ నగరంలో సున్నా స్థాయి కర్బన ఉద్గారాల (నెట్‌ జీరో)తో ఫ్యూచర్‌ సిటీని ఇదే తరహాలో నిర్మించాలని కోరుకుంటున్నా..’అని సీఎం తెలిపారు. గ్రీన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. మెట్రో రైలు, ఫ్యూచర్‌ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్‌ రోడ్లు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.  

విమాన సేవలు ప్రారంభించాలి 
హైదరాబాద్‌–కిటాక్యుషు నగరాల మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించాలని అక్కడి మేయర్‌ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. జపనీస్‌ భాష పాఠశాలను హైదారాబద్‌లో స్థాపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన యువతను తమకు అందించాలని, అక్కడి మేయర్‌ కోరడంతో సీఎం ఈ మేరకు సూచన చేశారు. మా వద్ద నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వారికి జపనీస్‌ భాష నేర్పిస్తే మీ అవసరాలు తీరుతాయి..’అని చెప్పారు. రెండు పక్షాల మధ్య జరిగిన ఒప్పందాలను నిర్దిష్ట గడువుల్లోగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నిరంతరం చర్చించాలని, సంప్రదింపులతో పురోగతి సాధించాలని నిర్ణయం తీసుకున్నారు.  

కలిసి పనిచేస్తాం: కిటాక్యుషు మేయర్‌ 
రేవంత్‌ బృందం అంతకుముందు ఓసిన్‌–ఓసాకా ప్రాంతం నుంచి కిటాక్యుషు నగరానికి బుల్లెట్‌ ట్రైన్‌లో చేరుకుంది. చారిత్రాత్మక కోకుర క్యాజిల్‌ వద్ద నగర మేయర్‌ కజుíÙయా టేకుచి వారికి సాంప్రదాయ స్వాగతం పలికారు. సమురాయ్‌ ఖడ్గ వీరులు, టైకో డ్రమ్‌ బృందాల సభ్యులు ఆటపాటలతో ఆలరించారు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా కిటాక్యుషు ఉంది. అదే ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో ఒకటిగా ఉంది. ఈ అంశాన్ని మేయర్‌ టేకుచి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.  

కిటాక్యుషు ప్రభుత్వం ..తెలంగాణ, హైదరాబాద్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వివరించారు. కిటాక్యుషు నగరంలో ఒకప్పుడు అత్యంత కలుíÙతమైన మురాసకి నదిని అత్యంత స్వచ్ఛమైన నదిగా పునరుద్ధరించారు. దీని అధ్యయనంలో భాగంగా సీఎం బృందం ఓ మ్యూజియాన్ని సందర్శించింది. నడక ద్వారా నదీ తీరాన్ని పరిశీలించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement