Hyderabad Drunk and Drive Police Says Driving License Will Be Cancelled - Sakshi
Sakshi News home page

Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!

May 18 2022 10:13 AM | Updated on May 18 2022 10:53 AM

Drunken Drive At Hyderabad Police Says Driving License Will Be Cancelled - Sakshi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు (ఫైల్‌)

బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు.  

బంజారాహిల్స్‌: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్‌ ఎనలైజర్‌) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు.

కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్‌ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు.

బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు.  
చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం

485  మంది కోర్టులో హాజరు..
డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు.

పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు 
జరుగుతున్నాయి.
చదవండి👉🏼 ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?

తీరు మారడం లేదు..
మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.  

ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.  పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ ట్యాబ్‌లో ఫీడ్‌ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి.
చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య 

Advertisement
 
Advertisement
Advertisement