
రూ.5 లక్షల పరిహారం, చికిత్స ఖర్చు చెల్లించాలని తీర్పు
2021 నాటి కేసులో వినియోగదారుల ఫోరం ఆదేశం
ఖమ్మం లీగల్: మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కడుపులో సర్జికల్ టవల్ వదిలేసిన ఖమ్మంలోని పీపుల్స్ నర్సింగ్హోం వైద్యులు పరిహారం, వైద్యఖర్చులు చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు తీర్పు చెప్పారు. మంగళవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఏదులాపురానికి చెందిన కాండ్రుకోట సౌమ్య ప్రసవం కోసం పీపుల్స్ నర్సింగ్హోం ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు 2021 డిసెంబర్ 1న శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలానికి సౌమ్య కడుపు నొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడటంతో వైద్యులు పరీక్షించి సాధారణ సమస్యగానే చెబుతూ మందులు ఇచ్చారు.
అయినా, పరిస్థితి చక్కబడకపోవడంతో 2022 ఏప్రిల్ 1న అదే ఆస్పత్రికి వెళ్తే స్కాన్ చేయించి మరో డాక్టర్ వద్దకు పంపించారు. అక్కడి వైద్యులు కడుపులో రాయి వంటి పదార్థాన్ని గుర్తించడంతో సౌమ్య పీపుల్స్ నర్సింగ్హోం వైద్యులకు ఫోన్లో చెబితే కలిసే అవకాశం ఇవ్వలేదు. ఆపై ఏప్రిల్ 4న ఆమె తీవ్ర అస్వస్థతకు గురికాగా మరో ఆస్పత్రిలో ఏప్రిల్ 6న ఆపరేషన్ చేయడంతో సౌమ్య కడుపులో 15X20 సైజులో సర్జికల్ టవల్ బయటపడింది.
దీంతో ఆమె జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. కేసు వివరాలు పరిశీలించాక వైద్య ఖర్చుల కింద రూ.1,35,533ను 8 శాతం వడ్డీతో చెల్లించాలని.. పరిహారం, మానసిక వేదన, ఇబ్బందుల కింద రూ.5 లక్షలు, కేసు ఖర్చుల కింద రూ.40 వేలను ఖమ్మం పీపుల్స్ నర్సింగ్హోమ్ చెల్లించాలని మంగళవారం తీర్పు ఇచ్చారు.