దిల్‌సుఖ్‌ నగర్‌ పేలుళ్ల నిందితుడు మక్బూల్‌ మృతి | Dilsukhnagar Twin blast case Accused Sayed Maqbool Died | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌ నగర్‌ పేలుళ్ల నిందితుడు మక్బూల్‌ మృతి

Jul 26 2024 9:37 AM | Updated on Jul 26 2024 11:51 AM

Dilsukhnagar Twin blast case Accused Sayed Maqbool Died

హైదరాబాద్, సాక్షి: దిల్‌సుఖ్‌ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు చర్లపల్లి జైలు అధికారులు ప్రకటించారు. 

ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థకు పని చేసిన సయ్యద్‌ మక్బూల్‌.. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో పాల్గొన్నాడని ఎన్‌ఐఏ నిర్ధారించింది. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా విధించింది. అయితే.. దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మక్బూల్‌ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 గంటలకు ఆనంద్ టిఫిన్స్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట బాంబుల కేసును మూడేళ్లపాటు విచారణ చేసిన ఎన్‌ఐఏ.. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్‌ అఖ్తర్, యాసిన్‌ భత్కల్, ఎజాజ్‌ షేక్, మక్బూల్ దోషులుగా తేల్చారు. ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. వీరిలో మక్బూల్ ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. 

ఇక.. మహారాష్ట్రకు చెందిన ముక్బూల్‌ బాంబులు తయారు చేసేవాడు. ఎన్‌ఐఏ అతన్ని అరెస్ట్‌ చేసిన టైంలో.. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆవరణలో తెలుగు మీడియాను చూస్తూ.. తాను మూడు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement