టెన్త్‌ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం.. ఎగ్జామ్‌ సెంటర్‌లో జరిగింది ఇదేనా..?

Debar Student: New Angle In Telangana 10th Class Paper Leak Case - Sakshi

సాక్షి, వరంగల్‌: పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో ఎవరో చేసిన తప్పిదానికి విద్యార్థి డిబార్ కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనతో ఐదేళ్ళు డిబార్ అయిన దండెబోయిన హరీష్ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థి హరీష్‌తో పాటు తల్లి లలిత పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని డిబార్‌ను ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటిపర్యంతమై  అధికారులను వేడుకున్నారు.

హన్మకొండ జిల్లా కమలాపుర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థి హరీష్ నుంచి శివ అనే బాలుడు రెండు రోజుల క్రితం హిందీ ప్రశ్నాపత్రం లాకెళ్లి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ కేసు సంచలనంగా మారి బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు పది మందిపై కేసు నమోదు చేశారు. డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి ఇన్విజిలేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థి హరీష్‌ను ఐదేళ్లు డిబార్ చేశారు. డిబార్ అయిన హరీష్ ఈ రోజు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు.

పరీక్ష రాస్తున్న సమయంలో హఠాత్తుగా తాను కూర్చున్న కిటికీ వద్దకు ఓ వ్యక్తి వచ్చి క్వశ్చన్ పేపర్ అడిగాడు.. తను ఇవ్వనని చెప్పాను కొంత సమయం గడిచాక వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడనుకుని క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి ఆన్సర్ పేపర్ పై మార్జిన్ కొట్టుకుంటుండగా మళ్లీ ఆ వ్యక్తి వచ్చి ప్రశ్నపత్రం లాక్కుని ఫొటో తీసుకుని మళ్లీ పేపర్ నావైపు విసిరాడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు లేకుంటే చంపుతామని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: టెన్త్‌ పేపర్‌ లీక్‌ పెద్ద గేమ్‌ప్లాన్‌

అంత వరకే తనకు తెలుసని ఆ తరువాత ఎం జరిగిందో తనకు తెలియదని విద్యార్థి హరీష్ అంటున్నాడు. ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి సెంటర్ వద్దకు రాగానే డిఈఓ హాల్ టికెట్ తీసుకుని సంతకం తీసుకున్నాడని ఎందుకు సంతకం తీసుకున్నారని అడిగితే హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఐదేళ్లు డిబార్ చేశామని తెలిపారని అన్నారు. తనకు తెలియకుండా జరిగిన తప్పుకు శిక్ష వేయడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు నేను బలి అయ్యానని, నా భవిష్యత్తును నాశనం చేయొద్దని శనివారం జరిగే గణితం పరీక్షకు అధికారులు అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు

హరీష్‌తోపాటు తల్లి లలిత సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నా కొడుకు భవిష్యత్తుతో ఆడుకోవద్దని వేడుకున్నారు. ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరో చేసిన తప్పును నాకొడుకు శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కష్టం చేసుకుని బతికే కుటుంబం మాది.. ఏంజెపి గురుకుల్ పాఠశాలలో హాస్టల్‌లో చదివిస్తున్నామని, న్యాయం చేయాలని విద్యార్థి తల్లి కోరుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top