ఈమెయిల్‌ ట్రిక్స్‌.. సైబర్‌ ఎటాక్స్‌!

Cyber Criminals Cheating With Fake Emails And Massages - Sakshi

బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాల వారికి ఫేక్‌ మెయిల్స్‌ 

రోజుకు సరాసరి మూడు సైబర్‌ దాడులు 

ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌ అండ్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో వెల్లడి 

సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని నిపుణుల సూచన 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో బ్యాంకులు, హెల్త్‌కేర్‌ రంగంలో పనిచేస్తున్న పలు సంస్థలను సైబర్‌దాడులు గజగజలాడిస్తున్నాయి. ప్రతిరోజూ సరాసరిన మూడు సైబర్‌ ఎటాక్స్‌ తమ వద్ద నమోదవుతున్నట్లు నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌ అండ్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌’ తాజా అధ్యయనంలో తేలింది. సైబర్‌ దాడులతోపాటు ఫిషింగ్‌ మెయిల్స్‌తో ఆయా బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, హెల్త్‌కేర్‌ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది.

ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉన్నవారికి నిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్‌లో సుమారు 26 శాతం ఫిషింగ్‌ మెయిల్స్‌(చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరిచి చూస్తే ఆయా సంస్థల డేటాబేస్‌ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్‌వేర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్‌ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన సుమారు 800 మంది నిపుణులు సైబర్‌దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఉపయోగాలివే.. 
సైబర్‌ దాడుల నిరోధానికి ఇప్పటికే నగరంలో సైబర్‌ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయని.. వాటితో చేకూరే ప్రయోజనాలను ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. సైబర్‌ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్‌ను ఏర్పాటు చేయడం, సైబర్‌ సెక్యూరిటీ క్లస్టర్‌లో చేరిన సంస్థలు లేదా దేశాలు, సంస్థలకు సైబర్‌ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. నేరాలపై జరిపే పరిశోధనకు నిపుణులు సహకరిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్‌ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్‌ నేరాల నిరోధానికి అవలంభించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. ఈ విషయంలో ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు మార్గనిర్ధేశం చేస్తారు. 

చర్యలివే.. 
సైబర్‌ దాడులపై అప్రమత్తమైన రాష్ట్ర ఐటీశాఖ సైతం ఈ విషయంలో పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న విషయం విధితమే. సైబర్‌దాడుల నిరోధానికి సైబర్‌ సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఐటీశాఖ వర్గాలు‘సాక్షి’కితెలిపాయి.సెక్యూరిటీఆపరేషన్స్‌సెంటర్‌తోపాటుహేగ్‌సెక్యూరిటీడెల్టా,సీడాక్‌సంస్థలసౌజన్యంతోసైబర్‌దాడులనిరోధానికి ప్రయత్నిస్తున్నామన్నాయి.  

పెరుగుతున్న సైబర్‌ నేరాలు.. 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాదిగా సుమారు వెయ్యికిపైగా సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. ఇందులో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్‌వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డేటా, సైబర్‌ స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్‌ కార్డు మోసాలు వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు రూపొందించే అంశాలను సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో భాగంగా ఉన్నాయి. ఈ రంగంలో మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం, డేటా భద్రత వంటి అంశాలకు ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ కోర్సులకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అవగాహన తప్పనిసరి అని.. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top