కరీంనగర్లో కొత్త వైరస్ కలకలం
సాక్షి, కరీంనగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఎంత మందికి కరోనా వైరస్ సోకిందో తెలియక ఆందోళన కలిగిస్తోంది. యూకే నుంచి వచ్చిన 18మందిలో 16మంది శాంపిల్స్ను వైద్యులు సేకరించారు. వైద్యులు వారి నుంచి తీసుకున్న శాంపిల్స్ను పరీక్షల కోసం పంపించారు.
పరీక్షల నివేదికలు వచ్చేవరకు వారిని హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, స్వీయ నియంత్రణతో తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ను సమూలంగా ఎదుర్కోవచ్చని ఆమె తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 12 మంది, పెద్దపల్లిలో నలుగురు, సిరిసిల్లలో ఒకరు, వరంగల్లో ఒకరు యూకే నుంచి వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు.