
మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ హైకమాండ్ సూచన
ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ భేటీ
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు,ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై ముగిసిన కసరత్తు
ఏ క్షణమైనా అధిష్టానం నుంచి ప్రకటన
పెద్దల పిలుపుతో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం భట్టి.. ఫోన్లో మంతనాలు
రాష్ట్రంలో మూడు, నాలుగు బహిరంగ సభల నిర్వహణకు యోచన
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కొత్తవారికి పాత మంత్రుల శాఖలు
శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు.
భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.
కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎవరూ పార్టీ వీడకుండా చూడండి
మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన
కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం.
మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం.