ఇదే 'ఫ్యూచర్‌' | CM Revanth Reddy Comments About Bharat future city | Sakshi
Sakshi News home page

ఇదే 'ఫ్యూచర్‌'

Jun 11 2026 1:40 AM | Updated on Jun 11 2026 5:13 AM

CM Revanth Reddy Comments About Bharat future city

ఎఫ్‌సీడీఏ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, ప్రసాద్‌కుమార్, పొంగులేటి, శ్రీధర్‌బాబు, మహేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, కసిరెడ్డి, నవీన్‌యాదవ్, శ్రీనివాసరెడ్డి, వీరపల్లి శంకర్‌ తదితరులు

గ్రీన్‌ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లతో విరాజిల్లబోతోంది 

టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది 

ఎఫ్‌సీడీఏ కార్యాలయ భవనం ప్రారం¿ోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి  

గ్రీన్‌ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లతో విరాజిల్లబోతోంది 

టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది 

ఎఫ్‌సీడీఏ కార్యాలయ భవనం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి    

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రపంచానికి ఓ దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్‌ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లు, ఏఐ, ఫార్చ్యూన్‌– 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది. టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది. 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి వేదికగా నిలవబోతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా ఎనిమిదేళ్లలో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వేదికగా నిర్మించిన ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనాన్ని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఎఫ్‌సీడీఏ విజన్‌ ఇన్‌ యాక్షన్‌ ప్లాన్‌ పోర్టల్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. 
‘150 రోజుల్లో ఎఫ్‌సీడీఏ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి పథం వైపు నడవాలి. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని గ్రామాలను ఫ్యూచర్‌ సిటీలో కలిపాం. భవిష్యత్తులో ఈ నగరం మరింత రాణిస్తుంది. అడ్డుపడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఫ్యూచర్‌ సిటీ కాలుష్య రహితనగరంగా రాణిస్తుంది  

చిన్న వర్షానికే వరదలు 
నగరంలోని వీధులను తరచూ ముంచెత్తుతున్న వరదలకు, ట్రాఫిక్‌ అంతరాయానికి నాటి పాలకుల పాపమే కారణం. నగరంలో పెద్ద వర్షం పడలేదు. చిన్నపాటి వర్షానికే వరద ఏరులై పారింది. ట్రాఫిక్‌ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పట్టింది. పదేళ్లలో అభివృద్ధి చేశాం. వంద కోట్లకు ఎకరం అమ్మామని చెప్పడం కాదు. నిన్నటి ట్రాపిక్‌ సమస్యకు కారణం ఎవరో చెప్పాలి.  

కబ్జాలపై మరింత కఠినంగా.. 
గత ప్రభుత్వంలోని దుర్మార్గులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చెరువులను చెరబట్టి, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే చెరువులు, కుంటలోŠల్‌ ఉండాల్సిన వరద నీరు రోడ్లపైకి వస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి, చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నాం. వాటి చుట్టూ పార్కులు, మార్కెట్లు తీసుకొచ్చి లేక్‌ ఎకానామీ సృష్టించబోతున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నాం. కబ్జాలకు పాల్పడిన వాళ్లను వదలం. వారి వెనుక ఉన్నవాళ్ల తోకలు కట్‌ చేయడానికి కూడా వెనకాడం. 

అదేమైనా మీ తాత జాగీరా? 
బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి 15 ఎకరాలు కబ్జా చేశాడు. దీన్ని కేసీఆర్‌ ఆయనకు రాసిచ్చాడు. అదేమైనా మీ తాతా జాగీరా? ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించాం. కుంటకు మళ్లీ జీవం పోశాం. గండిపేట, హిమాయత్‌సాగర్‌ ఆక్రమణలను తొలగించే పని చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే..’ అని సీఎం చెప్పారు.  

తెలంగాణ ముఖ చిత్రమే మారింది 
‘హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి కులీకుతుబ్‌షాలు, నిజాం నవాబులు హైదరాబాద్‌ నగరాన్ని విస్తరింపజేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చార్మినార్‌ నుంచి గుల్జార్‌హౌస్‌ వరకు, మొజాంజాహీ మార్కెట్‌ నుంచి ఖబూతర్‌ఖానా వరకు విస్తరించకపోతే చరిత్రలో గుర్తింపు వచ్చేదా? 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌ విస్తరణతో జంటనగరాలుగా వెలుగొందుతున్నాయి. సైబరాబాద్‌ సాంకేతిక విప్లవం. 60 శాతం ఆదాయం అందిస్తుంది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లు పలుకుతోంది. తెలంగాణ ముఖ చిత్రమే మారింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ అధికం. 

కుట్రలు, కుతంత్రాలు చేసినవాళ్లూ ఉన్నారు.. 
1908లో నగరాన్ని వరదలు ముంచెత్తి వేలాది మంది చనిపోతే నిజాం చలించారు. మూసీ, ఈసీలు ఉప్పెనై కమ్మేయకుండా జంట జలాశయాలు నిర్మించారు. ఆనాడు సైబరాబాద్, హైటెక్‌సిటీ అంటే నవ్వినోళ్లు ఉన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వద్దే వద్దు అన్నోళ్లూ ఉన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ఆనాటి ముఖ్యÐమంత్రులు హైటెక్‌ సిటీ, ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్, జీనోమ్‌ వ్యాలీ, ఐటీ సంస్థలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలను తీసుకురాకపోతే.. పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవా?..’ అని రేవంత్‌ ప్రశ్నించారు.  

వచ్చేసారి ప్రతిపక్ష హోదాకూడా రాదు.. 
‘ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు.. నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్‌లో పండిండు. మారీచుడు, సుబాహులను మనపై వదిలాడు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు కలిసి ఫ్యూచర్‌ సిటీని అడ్డుకుంటామంటున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. కానీ మీకు గతమే ఉంది. భవిష్యత్తు లేదు. ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..’ అని సీఎం ఎద్దేవా చేశారు.  

విషం చిమ్ముతున్న బీఆర్‌ఎస్‌: భట్టి 
ఆనాటి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి, గ్రీన్‌ ఫ్యూచర్‌ సిటీని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఉన్న బీఆర్‌ఎస్‌ విషం చిమ్ముతోందని విమర్శించారు. కొన్ని గ్రామాలను ఎఫ్‌సీడీఏలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

హైటెక్‌ సిటీకి దీటుగా..: శ్రీధర్‌బాబు 
హైటెక్‌ సిటీకి దీటుగా కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో రెండున్నరేళ్లుగా అహరి్నశలు శ్రమిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక తదితరులు మాట్లాడారు.  

కొత్త శక్తిని నింపుకోవడానికి కలిసి రండి 
– ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి  
‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఇప్పుడు ఒక నిజం. మనం విదేశాలకు వెళ్లి గొప్ప నగరాలను చూసినప్పుడల్లా.. ఇంతటి ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, అద్భుతంగా నిర్వహించే నగరం మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాం. భారతీయులందరి సామూహిక కోరికకు సమాధానమే ఈ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ. దీని కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోనే ప్రారంభించుకున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో దీని ప్రాముఖ్యత కారణంగా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఫ్యూచర్‌ సిటీని భూగోళంపైనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే వరకు శ్రమించేలా కొత్త శక్తిని నింపుకోవడానికి నాతో కలిసి రండి..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.    

Advertisement
 
Advertisement
Advertisement